నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్లో (Nagpur) విషాద ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి తన భార్యా, ఇద్దరు పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగ్పూర్లోని జరిపట్కాకు చెందిన కిరణ్మయి(33), మదన్ అగర్వాల్ (40) భార్యాభర్తలు. వీరికి పదేళ్ల రిషబ్ అనే కొడుకు, తోషిత అనే ఐదేళ్ల పాప ఉన్నారు. ఈ కుటుంబం జరిపట్కాలోని దయానంద్ పార్క్ సమీపంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ సొసైటీలోని ఇంట్లో నివాసం ఉంటోంది.
దయానంద్ పార్క్ సమీపంలోనే మదన్ ఒక ఫాస్ట్ఫుడ్ సెంటర్ను (Fast Food Centre) నడుపుతుండేవాడు. మంచి బిజీ ఏరియా కావడంతో అతని బిజినెస్ కూడా బాగానే నడిచేది. అలా వచ్చిన డబ్బుతో భార్యాపిల్లలను సంతోషంగా చూసుకునేవాడు. కానీ.. మదన్కు క్రికెట్ బెట్టింగ్ అలవాటయింది. రానురానూ అదో వ్యసనంగా మారింది. ఈ కారణంగా కుటుంబం అప్పులపాలైంది. బ్యాంకు అప్పుకు సంబంధించిన నెలవారీ వాయిదా డబ్బు చెల్లించలేదని గతేడాది అతని ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారు.
దీంతో.. మదన్ అగర్వాల్ అదే ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్స్లో సర్వం కోల్పోవడమే కాకుండా అప్పుల పాలు కావడంతో మదన్ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. మదన్ అగర్వాల్ దాదాపు 90 లక్షల వరకూ అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే.. గత సోమవారం రాత్రి మదన్ బ్యాంక్ అకౌంట్కు అతని అన్నయ్య అమిత్ రూ.1,500 ట్రాన్స్ఫర్ చేశాడు. అమిత్ నాగ్పూర్లోని శాంతినగర్కు సమీపంలో తులసీనగర్ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు.
క్రికెట్ బెట్టింగ్లో పెద్ద మొత్తంలో డబ్బు పోవడం, అప్పుల పాలు కావడంతో మదన్ కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే.. గత సోమవారం ఇంట్లో భార్యాపిల్లలు తిని నిద్రపోయాక కత్తితో ముగ్గురినీ పొడిచి చంపాడు. వాళ్లు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తొలుత భార్య గదిలోకి వెళ్లి ఆమె గొంతు కోసి చంపాడు. తర్వాత పిల్లలిద్దరినీ పొడిచి చంపాడు. ఆ తర్వాత.. సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని తానూ ప్రాణాలు తీసుకున్నాడు. స్పాట్లో రక్తపు మరకలతో కూడిన పెద్ద కత్తి పోలీసులకు కనిపించింది.
ఈ కుటుంబం చనిపోయిన విషయం మదన్ స్నేహితుడు ఆ మరుసటి రోజు సాయంత్రం మదన్ ఇంటికి వెళ్లగా తెలిసింది. ఇంటికి వెళ్లి ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడం, ఎన్నిసార్లు మదన్కు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో అతని స్నేహితుడికి అనుమానమొచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూసిన వారికి ఈ షాకింగ్ దృశ్యం కనిపించింది. కుటుంబంలో ఎవరూ ప్రాణాలతో మిగలలేదు. బెడ్రూంలో మదన్ భార్య, పిల్లలు రక్తపు మడుగులో కనిపించారు. మదన్ సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు స్పాట్కు చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. అప్పులు తీర్చలేని స్థితిలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన మదన్ క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జరిపట్కా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదన్ మొబైల్ను సీజ్ చేశారు. ఇలా నిండు కుటుంబం విగత జీవులుగా కనిపించడంతో ఇరుగుపొరుగు వారు ఉలిక్కిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Family suicide, Maharastra, Nagpur