నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఓ దళిత బాలిక మృతి మిస్టరీగా మారింది. వారం రోజులు గడిచిన కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. వివరాలు.. కొప్పోలు గ్రామానికి చెందిన బాలిక(17) .. నల్గొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఓకేషనల్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే ఎస్సీ హాస్టల్లో ఉంటుంది. ఈ ఘటన జరగడానికి మూడు రోజుల ముందు బాలిక.. ఇంటికి వచ్చింది. ఈ నెల12న తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నిద్రపోయిన బాలిక, అర్ధరాత్రి తర్వాత కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. అయితే 13న ఉదయం కొప్పోలు శివారులోని రైసు మిల్లు వెనక వ్యవసాయ భూమిలో బాలిక మృతదేహం కనిపించింది.
బాలిక మెడ చుట్టూ చున్నీ బిగించిన ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాకుండా ఘటన స్థలంలో బీరు సీసా ముక్కలు పడి ఉన్నాయి. దీంతో గత కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న అదే గ్రామానికి చెందిన యువకుడే.. బాలికపై లైంగికదాడి జరిపి హత్య చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే దీనిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, పలు పార్టీల నేతలు పలుసార్లు ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసుల తీరును వారు విమర్శించారు. బాలిక దారుణ హత్యకు గురైతే, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక పోలీసులపై ఆరోపణలు రావడంతో ఎస్పీ రంగనాథ్.. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ రామకృష్ణను వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేసు పారదర్శక విచారణకు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్, ఏఎస్పీ సతీష్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఇక, శనివారం ఏఎస్పీ సతీష్, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి ఆధ్వర్యంలో శనివారం బాలిక మృతదేహాన్ని బయటికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక వచ్చాక కేసు సంబంధించి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు బాలిక మృతదేహం లభించిన చోట పోలీసులు ఆనవాళ్లు సేకరించలేదని, బాలిక మెడకు బిగుసుకున్న చున్నీ, చెవి నుంచి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కేసును పక్కదోవ పట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికైనా అసలైన నిందితులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nalgonda, Telangana