తల్లికి పిల్లలే ప్రపంచం. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా తల్లిమనసు తల్లడిల్లిపోతుంది. నిత్యం వారి ఆలనా పాలన చూస్తుంటుంది. ఏ తల్లీ తన పిల్లల్ని చేజేతులో చంపుకోవాలని చూడదు. అసలు అలాంటి తల్లులు ఈ భూమిమీద ఉండరని వాదించేవారే ఎక్కువ. కానీ ఓ కసాయి తల్లి.. రక్తంపంచుకొని పుట్టిన పిల్లలను దారుణంగా హత్య చేసింది. రెండు పెళ్లిళ్లు, ఒకరితో సన్నిహిత సంబంధం వెరసి ఏ జరిగిందో ఏమో తెలియదుగానీ పిల్లలకు ఉరివేసింది. ఈ స్టోరీలో చాలా ట్విస్టులున్నా కన్నబిడ్డలను హతమార్చాల్సిన అవసరం తల్లికేమోచ్చిందనేదిమాత్రం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రిలోని (Rajahmundry) ఆనంద్ నగర్ లో కన్నతల్లి ఇద్దరు పిల్లలను హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన లక్ష్మీ అనూషకు 13 ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) తాడేపల్లి గూడెంకు చెందిన రాము అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె చిన్మయి, కుమారుడు మోహిత్ శ్రీ సత్యసాయి ఉన్నారు. ఐతే కుటుంబ కలహాలతో ఐదేళ్ల క్రితం రాము ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తిరిగి రాజమండ్రికి వచ్చేసింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అనూష బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. మరోవైపు వడ్డీ వ్యాపారం కూడా చేస్తోంది.
ఏడాది క్రితం రెండో పెళ్లి..
ఈ నేపథ్యంలో ఏడాది క్రితం జొన్నలగడ్డ రామకృష్ణ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఐతే నిత్యం గొడవ పడటం, ఆత్మహత్యాయత్నాలు చేస్తుండటంతో విసిగిపోయిన అతడు పోలవరంలో నివాసముంటున్నాడు. కొన్నాళ్లకు అనూష.. సీతంపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తికి దగ్గరైనట్లు తెలుస్తోంది. నిత్యం తన పిల్లల్ని కొడుతుండటం, అడ్డొచ్చిన తల్లిపైనా దాడి చేస్తుండేదని సమాచారం. ఇటీవల తల్లిని కొట్టడంతో ఆమె భుజానికి గాయమైంది. ఈ విషయమై రెండో భర్త అత్తగారిని పరామర్శించడంతో పాటు బుద్ధిమార్చుకోవాలని అనూషకు సూచించాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెను మందలించారు.
కిరాతకమా..? మనస్తాపమా..?
ఈ నేపథ్యంలో అదివారం రాత్రి 11గంటల సమయంలో ఇద్దరు పిల్లలకు ఉరివేసిన అనూష.. ఆ తర్వాత ఉరితాడును కోసేసి వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో పాటు ప్రియుడు సతీష్ కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. వారు వెంటనే ఇంటికి చేరుకునే సమయానికి తాను కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. వారు అనూషతో పాటు పిల్లల్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించగా పిల్లలు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఐతే తొలుత తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుందని.. తాను చనిపోతే పిల్లలు ఒంటరివారవుతారనే వారిని కూడా చంపి ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరుగుతోంది.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనూషను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘతకానికి పాల్పడిన కసాయి తల్లి లక్ష్మి అనూషను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి ముత్యం కనకదుర్గ డిమాండ్ చేస్తోంది. పోలీసులు అనూషపై హత్యకేసు నమోదు చేశారు. అనూష చివరిసారి ఫోన్ చేసి వారిని పిలిపించి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో తల్లిపాత్ర మాత్రమే ఉందా లేక వెనుక ఎవరి హస్తమైనా ఉందా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime, Mother killed her baby, Rajahmundry