G.Srinivasa Reddy, Khammam, News18
తెలిసీ తెలియని తనంతో అతనికి మనసిచ్చింది.. ఇంట్లో వాళ్లను ఒప్పించి కచ్చితంగా పెళ్లి చేసుకుందామని నమ్మిస్తే తనువు కూడా అర్పించింది. కానీ తనది అమాయకత్వమని, వాడిది వ్యామోహమని ఆలస్యంగా అర్థమైంది. అతనొచ్చి మీతో మాట్లాడతాడని ఇంట్లో వాళ్లకు దీమాగా చెప్పిన ఆమె.. చివరికి వాడి చేతిలో మోసపోయానని గ్రహించి, కుటుంబీకులకు ముఖం చూపించలేక బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించన వాడు మోసం చేశాడని ఓ మైనర్ (17) ప్రాణాలు తీసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కాగా, బాలికను లోబర్చుకుని అకృత్యాలకు పాల్పడిన ప్రియుణ్ని అరెస్టు చేయాలంటూ ఆమె కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కారేపల్లి పోలీసులు చెప్పిన వివరాలివి..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని ఎర్ర బోడు గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రేవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. మాణిక్యారం గ్రామ శివారులో రూప్ తండాకు చెందిన నునావత్ తారా చంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లపాటు శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు నిలదీశారు. అప్పుడా అమాయకురాలు తాను తారాచంద్ ను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పేసింది. తీరా ఇదే మాటను ప్రియుణ్ని అడగ్గా అతను ముఖం చాటేసాడు.
పెళ్లిలేదు, ఏమీ లేదు పొమ్మని ప్రియుడు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆమె నవంబర్ 28న ఇంట్లో ఉన్న ఎలకల మందు తాగేసి ఆత్మహత్యకు యత్నించింది. స్పృహతప్పి పడిపోయిన బాలికను కుటుంబీకులు ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది. బాలిక తండ్రి వీరస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పట్ల అన్ని రకాలుగా నేరానికి పాల్పడిన తారా చంద్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం పోలీసులను కోరింది. ఒక దశలో గ్రామస్తులు ఆందోళన కూడా నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Minor girl, Student suicide