MEDICAL STUDENT HARASSED BY NEIGHBOUR MINOR BOY WITH MESSAGES IN HYDERABAD SRD
Hyderabad : పక్కింటి పిల్లాడే కదా అని ఫోన్ ఇస్తే.. అక్కా అక్కా అంటూనే పాడుపని..
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad : ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది.
ఈ రోజుల్లో ఎవర్ని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మామంటే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కాటేయాలా అని ఆలోచిస్తారు. . అవతలివారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత సమాచారం ఇచ్చి లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. సోషల్ మీడియా మత్తులో పడి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు. వివరాల్లోకెళితే.. ఆమె ఓ మెడికల్ విద్యార్థిని. ఆమె ఇంటి పక్కన 9వ తరగతి చదివే ఓ పిల్లాడు ఉన్నాడు. అక్కా అని పిలుస్తూ.. తరచూ ఇంటికి వచ్చేవాడు. చిన్న పిల్లాడే కదా అని అడిగిన ప్రతిసారీ ఫోన్ ఇచ్చేది. అదే ఆమె చేసిన తప్పు అయిపోయింది. ఆ పిల్లాడు.. ఆమె ఫోన్ లో పాస్ వర్డ్ మార్చి.. అక్కడ నుంచి ఆమె పేరుతో ఆన్లైన్ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయంటూ వాపోయింది. తన ఈమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయంటూ అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్ అయ్యాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు అయితే.. చివరకు వేధింపులు తట్టుకోలేక యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్లు తీసుకొని వారి మెయిల్స్ ఓపెన్ చేయడం, పాస్వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్ ఓపెన్ చేసి అసభ్యకర మెసేజ్లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు. దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్ హోమ్కు తరలించారు. అయితే.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడని తెలియడంతో ఆ యువతి తీవ్ర నిరాశకు గురైంది.
ఇలా ఎవర్ని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.