కొంత గ్యాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు మళ్లీ పేట్రేగిపోయాయి. ఛత్తీస్ గఢ్ సరిహద్దుకు సమీపంగా మన్యం జిల్లాలో ప్రయాణికులతో వెళుతోన్న బస్సును మావోయస్టులు తగులబెట్టారు. ప్రయాణికులు లోపల ఉండగానే నక్సల్స్ బస్సుకు నిప్పు పెట్టినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా వెల్లడైంది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల ద్వారా తెలిసిన సమాచారమిదే..
ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పరివెల - కొత్తూరు గ్రామాల మధ్య (చింతూరు కు 10 km దూరంలో) జాతీయ హైవేపై ఆదివారం రాత్రి మావోయిస్టులు ఓ బస్సుకు నిప్పంటించి కాల్చేశారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో బస్సును అటకాయించిన మావోయిస్టులు.. ప్రయాణికులను దిగిపోవాల్సిందిగా బెదిరించారు. కానీ ఆ సమయంలో తమకు వేరే దిక్కులేదని, బస్సులోనే వెళ్లిపోతామని ప్రయాణికులు అభ్యర్థించారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు..
ప్రయాణికులు లోపల ఉండగానే బస్సుకు నిప్పంటించారు. మంటు వ్యాపించడంతో జనం చావు కేకలు పెడుతూ గబగబా బస్సుదిగేశారు. ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. బస్సులో ప్రయాణించిన అందరి బ్యాగులు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉండగా, దాడికి పాల్పడింది 5గురు మావోయిస్టులని, మరో 10 మంది చెట్ల పొదల్లోనే ఉండి అన్నీ గమనించినట్లు వెల్లడైంది.
మావోయిస్టులు బస్సును తగులబెట్టారన్న సమాచారంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. చింతూరు ఏఎస్పి కృష్ణకాంత్, ఎస్సై గజేంద్ర యాదగిరి ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిన సమీక్షించారు. బస్సును కాల్చేసిన తర్వాత మావోయస్టులు వదిలివెళ్లిన కరపత్రాలను పోలీసులు గుర్తించారు. దక్షిణ బస్తర్ లో ఇటీవల డ్రోన్ బాంబులతో పోలీసులు ఆదివాసీ గ్రామాలపై దాడులకు దిగడాన్ని నిరసిస్తున్నట్లు కరపత్రాల్లో రాసుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Maoist, Maoist attack