కన్నబిడ్డలే సర్వస్వంగా బతికే తల్లిదండ్రులు ఎందరో మనకు తెలుసు. పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకడాని అమ్మానాన్నలూ ఉంటారు. సంతానం క్షేమంగా ఉంటే అదే పదివేలని ప్రార్థించని దంపతులు ఉండరంటే అతిశయం కాదేమో. అయితే ఈ ఫ్యామిలీ మాత్రం చాలా భిన్నం. ఎవరైనా పిల్లకు ఆస్తిలో వాటా ఇస్తారు, మంచి బుద్దులు నేర్పిస్తారు. కానీ ఈ దంపతులు మాత్రం తమ నేరాల్లో కన్నకూతుర్ని భాగం చేసుకున్నారు. ఇప్పటికే చాలా సార్లు జైలుకు వెళ్లొచ్చిన ఆ అమ్మానాన్న.. తమ 19 ఏళ్ల కూతురితో కలిసి ఆడుతోన్న నాటకాలకు కామాటిపుర పోలీసులు తెరదించారు. పూర్తి వివరాలివి..
కూతురు ఎంట్రీతో..
ఈడొచ్చిన ఆడపిల్లను ఏ కుటుంబమైనా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అయితే సలీమ్ గారి కుటుంబం మాత్రం విభిన్నం. భార్య, కూతురుతో కలిసి అతను మమూలుగా పోగేసుకోవడంలేదు. ముందుగా కూతుర్ని రెక్కీకి పంపుతారు. చక్కగా ముస్తాబయ్యే ఆ అమ్మాయి.. వీధంతా తిరుగుతూ ఓ టార్గెట్ ను సెట్ చేస్తుంది. ఆ తర్వాత అమ్మనాన్నలిద్దరూ ఎంటరై, తండ్రి కాపలా బాధ్యతలు తీసుకుంటే, తల్లేమో లోపలికెళ్లి పని కానిచ్చేస్తుంది. హైదరాబాద్ సౌజ్ జోన్ డీసీపీ డాక్టర్ గజరావు భూపాల్ కథనం ప్రకారం...
అందంగా ముస్తాబై..
మైలార్దేవ్పల్లి మొగల్కాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్ పాత దుస్తుల వ్యాపారి. ఇతడి భార్య జకియా బేగం(43) గృహిణి. కూతురు అయేషా సిద్ధిఖీ(19) ఇంట్లోనే ఉంటుంది. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చోరీలను వృత్తిగా ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా ముస్తాబై బయటకు వస్తారు. కూతురు సిద్ధిఖీ చోరీకి అనువైన ఇళ్లను గుర్తించి ముందు రెక్కీ నిర్వహిస్తుంది. తండ్రి సలీమ్ ఆరుబయటే ఉంటూ పరిసరాలు గమనిస్తాడు. జకియాబేగం ఇంటో దూరి ఖరీదైన వస్తువులు కాజేసుకొస్తుంది.
విమానాల్లో జల్సాలు
ఫ్యామిలీ మొత్తం కలిసి 2019 నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఎవరైనా నిలదీస్తే అద్దె ఇంటి కోసం వెతుకుతున్నామని, తలుపులు తీసి ఉండటంతో లోపలకు వచ్చామంటూ తెలివిగా తప్పించుకుని బయటపడేవారు. చోరీ సొత్తును నగల వ్యాపారుల వద్ద తనఖా ఉంచటం లేదా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విమానాల్లో తిరుగుతూ జల్సా చేసే వారు.
చివరికి ఇలా
ఇటీవల చందూలాల్ బారాదరి, గుల్షన్నగర్, ఘాజిబండ తదితర ప్రాంతాల్లో వరుసగా నాలుగు చోరీలు జరగటంతో కామాటిపుర ఇన్స్పెక్టర్ జి.రాంబాబు, డీఐ జి.శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ ముగ్గుర్ని కామాటిపుర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 16.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు దక్షిణ మండలం డీసీపీ డాక్టర్ గజారావు భూపాల్ తెలిపారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ రాంబాబు, డీఐ శ్రీనివాస్, డీఎస్ఐ జి.ఎస్.డానియేల్, కానిస్టేబుళ్లు అబ్దుల్ జలీల్, కె.నవీన్ను డీసీపీ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad police, Thief Arrested