ఆమెకు తన అక్క మరిదితో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు బతకలేనంతగా ప్రేమించుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ.. ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు. దీంతో ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు కుటుంబసభ్యులు. కానీ ఇంతలో మళ్లీ అదే వ్యక్తి.. ఆ అమ్మాయితో తీసుకున్న ఫోటోలను ఇంటర్నెట్ లో లీక్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి అన్న చెల్లెను కాల్చాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ దారుణం. ఇందుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా లిసారి గేట్ వద్ద శనివారం చోటుచేసుకుందీ ఘటన. ఇస్లామాబాద్ గ్రామానికి చెందిన బాధితురాలు.. సొంత అక్క బావమరిది కాసీంను ప్రేమించింది. వారిరువురి మధ్య నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. అయితే పెళ్లి చేసుకోమంటే మాత్రం కాసీం ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయమైంది.
కానీ పెళ్లికి ఒప్పుకోని కాసీం.. అంతటితో ఆగకుండా వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. అవి కాస్తా వైరలయ్యాయి. మరోవైపు పెళ్లికి ఇంకా ఒక్కరోజు టైం ఉందనగా.. పెళ్లి కూతురు అన్నకు ఈ ఫోటోల వ్యవహారం తెలిసింది. దీంతో ఇంటి పరువును గంగలో కలిపిందనే ఆగ్రహంతో అతడు రగిలిపోయాడు. అనుకున్నదే తడువుగా.. పెళ్లికి ఒక్కరోజు ముందనగా.. ఆమెను పిస్తోల్ తో కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు బాధితురాలి చావుకు కారణమైన కాసీం ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Love, Love affair, Murder, Up news, Uttarpradesh