MAN KILLED 16 MARRIED WOMEN WHO ATTRACT TO ILLEGAL AFFAIRS IN HYDERABAD HSN
Hyderabad: అచ్చం అనుష్క సినిమా స్టోరీయే.. 16 మంది మహిళల మర్డర్ మిస్టరీ.. అతడెందుకు చంపాడో తెలిస్తే..
16 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్
హైదరాబాద్ లో సీరియల్ కిల్లర్ ఏకంగా 16 మంది మహిళలను చంపేశాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతడు ఎందుకు ఈ దారుణాలకు పాల్పడ్డాడో తెలిసి పోలీసులే షాకయ్యారు. అతడు చెప్పింది విని అందరికీ అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాయే గుర్తుకొచ్చింది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 16 మంది మహిళలను అతి కిరాతకంగా చంపిన ఓ సీరియల్ కిల్లర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు అలా మహిళల్ని టార్గెట్ గా చేసుకుని వరుస హత్యలు చేయడం వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలిసింది. మంగళవారం ఈ కేసు విషయమై పోలీసులు పలు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వెల్లడించారు. భర్తలను మోసం చేస్తున్న భార్యలను మాత్రమే అతడు టార్గెట్ చేసుకుంటున్నాడని తెలిసి అంతా విస్తుపోయారు. డబ్బు కోసమో, మరే ఇతర కారణం వల్లనో భర్తను మోసం చేసి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని ఈ సిరియల్ కిల్లర్ చంపేస్తున్నాడు. ఏంటీ ఎప్పుడో చూసిన సినిమా స్టోరీలా ఉంది కదూ. అవును ఇటీవల వచ్చిన అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా స్టోరీయే. ఆ సినిమాల ప్రత్యేక పాత్రలో నటించిన మాధవన్, ఓ పొలీస్ అధికారి సాయంతో అక్రమ సంబంధాలు పెట్టుకునే మహిళలను చంపేస్తుంటాడు. అచ్చం ఆ సినిమా స్టోరీయే రియల్ లైఫ్ లోనూ జరిగింది. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు అలియాస్ తలారీ అలియస్ సాయిలు స్టోన్ కటర్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. హైదరాబాద్ లోని బోరబండలో నివసించేవాడు. అతడి మొదటి భార్య పెళ్లయిన పదిహేను రోజులకే వేరొకరితో వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కాపురం తర్వాత విబేధాలు వచ్చి ఇద్దరు పిల్లలతో సహా రెండో భార్య వేరుగా ఉంటోంది. ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని ప్రత్యక్షంగా చూశాడు. అంతే ఆ ఘటనతో మహిళలపై కోపం పెంచుకున్నాడు. జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న భార్యలపై అసహ్యం పెంచుకున్నాడు. 2003వ సంవత్సరంలో తూఫ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాను సహజీవనం చేసిన మహిళను హత్య చేశాడు. అప్పటి నుంచి వరుసగా తన కంట పడిన మహిళల్లో పెడదోవ పట్టిన వారు ఉంటే, వారిని చంపేస్తూ వచ్చాడు.
కల్లు కాంపాండ్ కు వచ్చే మహిళలతో రాములు పరిచయం పెంచుకునేవాడు. వారితో మాటలు కలిపేవాడు. ఆ తర్వాత డబ్బు ఆశ చూపేవాడు. వారు కనుక ఆశపడి సరేనంటే వెంటనే తన వెంట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. అక్కడకు వెళ్లిన తర్వాత కూర్చోబెట్టి కుటుంబ పరిస్థితులను ఆరా తీసేవాడు. ఈ క్రమంలో భర్త గురించి చెడుగా చెప్పడమో, లేక ఆమెకు భర్త ఉన్నట్టు తేలడమో జరిగితే వారిపై శృంగారంలో పాల్గొంటున్న సమయంలోనే చీరతో ఉరి బిగించడమో, లేక బండరాయితో మోది చంపడమో చేసేవాడు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చేవాడు. మృతదేహంపై ఉండే ఆభరణాలను తీసుకునేవాడు. శవాన్ని గుర్తుపట్టకుండా చేసేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు.
వాస్తవానికి రాములును ఎనిమిది హత్యలు చేసిన తర్వాత 2009వ సంవత్సరంలోనే అక్టోబర్ 12న సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నార్సింగ్ లో జరిగిన హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది కూడా. చర్లపల్లి కేంద్ర కారాగారంలో కొన్నాళ్లు జైల్లో ఉన్నాడు. తప్పించుకునేందుకు తనకు పిచ్చిపట్టి నట్టు నాటకం ఆడాడు. దీంతో అతడిని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే అక్కడ తనలాగే పారిపోయేందుకు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కొందరు నేరస్థులతో కలిసి 2011వ సంవత్సరం డిసెంబర్ 29న తప్పించుకున్నాడు.
అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ సిటీ శివార్లకు వెళ్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా, తన పాత బుద్ధిని మాత్రం వదల్లేదు. దుండిగల్, బోయిన్ పల్లి పరిధిలో ముగ్గురిని చంపేశాడు. శామీర్ పేట, పటాన్ చెరు ప్రాంతాల్లో మరో ఇద్దరు మహిళలను హతమార్చాడు. ఇలా వరుసగా 16 హత్యలు చేశాడు. ఈ క్రమంలోనే రాములు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన భవన నిర్మాణ కూలీ. 15 రోజుల క్రితం అంకుశాపూర్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది. ఈ కేసు దర్యాప్తులో సీరియల్ కిల్లర్ రాములు ఘాతుకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు హత్యలతో పాటు చోరీలకు కూడా పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.