కొందరు మృగాళ్లకు కామవాంఛ తీర్చుకునేందుకు వావివరసలు లేకుండా పోతున్నాయి. మనుషులం అన్న సంగతి మరిచి పశువుల కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారు. ఓ కామాంధుడు కన్నపేగు బంధాన్ని కూడా మరిచాడు. రక్తంపంచుకు పుట్టిన కూతురి పాలిట కీచకుడిలా మారాడు. అంతేకాదు వరుసకు కూతురయ్యే బాలికపైనా ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేసిన పాపం పండటంతో కటకటలాపాలయ్యాడు. ఈ ఘోరం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari District) జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలోని వ్యక్తి అభంశుభం తెలియని బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. వారిలో ఒకరు కన్నకూతురుకాగా.. మరొకరు వరుసకు కూతురు అవుతుంది. గత నెల 21వ తేదీన ఆరేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ మృగాడు... ఆగస్టు 15న 14 ఏళ్ల బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు.
బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. దీంత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపరచగా రిమాండ్ విధించారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని ఆ మృగాడి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను మండలంలో ఘోరం జరిగింది. చినపాండ్రాక పంచాయతీలోని సీతారామపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను.. అదే గ్రామానికి చెందిన ముగ్గురుకు యువకులు గురువారం రాత్రి సమీపంలోని పశువల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఐతే బయటకి వెళ్లిన కుమార్తె ఎంతకి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా గాలించినా ఆమె ఆచూకి తెలియలేదు.
ఐతే తర్వాతి రోజు మధ్యాహ్నం బాలిక ఇంటికి వచ్చింది. ఎక్కడికెళ్లావని తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా విజయవాడ వెళ్లినట్లు సమాధానమిచ్చింది. ఐతే గ్రామ సర్పంచ్ వచ్చి బాలికను విచారించగా అసలు విషయం చెప్పింది. జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కర్నూలు జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కామినేని పల్లెలో అనిల్ కుమార్ అనే యువకుడు ఓ బాలికకు చాక్లెట్ ఆశచూపి ఆఘాయిత్యానికి యత్నించగా తప్పించుకోని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఏదో మూల రోజుకో కేసు వెలుగు చూస్తోంది. దిశ లాంటి చట్టం అమల్లోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతున్నా.. దానికి తగ్గట్లు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Child rape, Crime news, East Godavari Dist