(Syed Rafi, News18,Mahabubnagar)
మార్కెట్లో ఏదైనా చిన్న వస్తువు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే జనం ఆన్లైన్లో డబ్బులు పెట్టుబడి పెడితే లక్షాధికారులు అవుతారనే మాటలను నమ్మారు. ముక్కు, ముఖం తెలియని వ్యక్తుల మాటలు నమ్మి ఎలాంటి గుర్తింపు లేని..కనీసం ప్రభుత్వ నిబంధనలు(Government regulations)పాటించకుండా కేవలం యాప్ క్రియేట్(App Create)చేసి అందులో పెట్టుబడులు పెట్టమనగానే జనం ఎగబడ్డారు, కోట్లలో ఆదాయం వచ్చి పడుతుందని ఆశ పడ్డారు. సైబర్ నేరగాళ్లు(Cybercriminals)వేసిన ఉచ్చులో ఉమ్మడి మహబూబ్నగర్ (Mahabubnagar)జిల్లాలో చాలా మంది బాధితులు పడ్డారు. అసలు ఈ చీటింగ్(Cheating)జరిగిన తీరే చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నారు పోలీసులు.
యాప్ ద్వారా ఆన్లైన్ పెట్టుబడులు..
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఆన్లైన్ పెట్టుబడుల వ్యాపారం పేరుతో పెద్ద మోసం జరిగింది. యాప్ క్రియేట్ చేసి...వాట్సాప్ గ్రూప్ ద్వారా బాధితుల్ని బకరాలను చేశారు సైబర్ మోసగాళ్లు. గత కొద్ది రోజులుగా సోలార్ గోల్డ్ కోట్ పేరుతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురికి ఆన్లైన్లో డబ్బులు పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. సైబర్ మోసగాళ్ల మాటలను నమ్మారు నారాణయణపేట,మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన బాధితులు. కొందరు వేల రూపాయలు పెట్టుబడి పెడితే ..మరికొందరు లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు. సదరు ఆన్లైన్ యాప్ నిర్వాహకులు సైట్ క్లోజ్ చేయడంతో కోట్ల రూపాయల్లో మోసపోయినట్లు తేలింది.
కోట్లలో మోసం ..
6నెలల కిందట ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక వ్యక్తి ద్వారా ప్రారంభమైన సోలార్ గోల్డ్ కోర్టు వ్యాపారం పాలమూరు మొత్తం విస్తరించింది. సుమారు రెండు వేల మందికిపైగా ఈ యాప్ ద్వారా 10 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులు పెట్టారు. ఏజెంట్లు, బ్రాంచ్ ఆఫీసులు లేకుండానే వేలాది మందిని కేవలం ఒక్క యాప్తో బురిడి కొట్టించారు సైబర్ మోసగాళ్లు. ఈయాప్ మాయలో పడి మోసపోయిన బాధితుల్లో ఎక్కువగా మహబూబ్నగర్ అడ్డాకుల, పెబ్బేరు, కొల్లాపూర్, కొత్తకోట, వనపర్తి, గద్వాల, అమరచింత, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వాళ్లే ఉన్నారు.
వేలల్లో బాధితులు..
ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్లు పెట్టుబడులు పెట్టారు. సోలార్ గోల్డ్ కోర్టు ద్వారా డబ్బులు పెట్టిన వాళ్లు ప్రతిఫలం కోరడంతో 2-3రోజుల తర్వాత చెల్లిస్తామని వాట్సాప్ మెసేజ్లు పంపారు. తర్వాత సర్వర్ డౌన్, టెక్నికల్ ప్రాబ్లమ్తో యాప్ డిలీట్ చేయబడటంతో బాధితులు షాక్ అయ్యారు. ఆన్లైన్ యాప్లో పెట్టుబడి పేరుతో మోసపోయినట్లుగా తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం నిర్వాహకులు ఎవరో తెలియకుండా ఎలా ఆన్లైన్లో పెట్టుబడులు పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. అధిక డబ్బు కోసం ఆశపడితే కష్టార్జితం పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER CRIME, FAKE APPS, Mahabubnagar