సెల్ఫీ కోసం యువతులు ఇద్దరు అలా నది మధ్యలో ఉన్న రాళ్ల పైకి ఎక్కగానే.. ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. క్షణాల వ్యవధిలో వారు వచ్చిన దారి మొత్తం మూసుకుపోయింది.
సెల్ఫీ పిచ్చి ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్లో ఇద్దరు యువతులు సెల్ఫీ కోసం పెంచ్ నదిలోకి దిగారు. అసలే వరద ఉధృతితో ఒక్కసారిగా పెరగడంతో వారిద్దరూ మృత్యువును దగ్గరి నుంచి చూసినట్లయ్యింది. సెల్ఫీ కోసం వాళ్లు అలా నది మధ్యలో ఉన్న రాళ్ల పైకి ఎక్కారు. కానీ కాసేపటికే ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. క్షణాల వ్యవధిలో వారు వచ్చిన దారి మొత్తం మూసుకుపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ బండరాళ్లపైనే నిల్చొని కేకలు వేశారు.
వారి అరుపులను విన్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు తాళ్ల సాయంతో యువతులిద్దరిని రక్షించి.. ఒడ్డుకు చేర్చారు. దీంతో వారిద్దరూ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సెల్ఫీ కోసం యువత చేయని పిచ్చి పనులు అంటే మరొకటి లేదు. కొందరు యువకులు రైలు పట్టాల పై నుంచి సెల్ఫీ దిగి రిస్క్ తీసుకుంటే...మరికొందరు ఎత్తైన భవనం పై నుంచి దూకుతున్నట్లు ప్రమాదకరమైన ఫోజులతో సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.