శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట వివాహమైన రెండు నెలలకే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ రెండు కుటుంబాలను శోక సంద్రంలో ముంచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీష్ (29), దివ్య (21) ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరివి ఎదురెదురు ఇళ్లే కావడం గమనార్హం. దీంతో.. వీరిద్దరి స్నేహం మరింత పెరిగింది.
హరీష్ ఎంబీఏ చదివి విశాఖలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. దివ్య విజయనగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఇద్దరూ చెరో చోట ఉన్నప్పటికీ వారి ప్రేమ హరీష్, దివ్యను దగ్గర చేసింది. ఇద్దరూ ఫోన్లో కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు. హరీష్ అప్పుడప్పుడూ దివ్యను కలవడానికి వెళుతుండేవాడు. దివ్య కూడా హరీష్ కోసం విశాఖ వెళుతుండేది. ఇలా వీరి ప్రేమ ప్రయాణం సాగుతుండగా దివ్య, హరీష్ ప్రేమలో ఉన్న విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో హరీష్, దివ్య ధైర్యం చేసి తమకు పెళ్లి చేయాలని పెద్దలను కోరారు. పెద్దలు వీళ్ల పెళ్లికి ససేమిరా అన్నారు.
ఇది కూడా చదవండి: Wife: ఈ కారణంతో భర్తకు దూరమైన భార్యవి నువ్వేనేమో తల్లీ.. ఇలా చేయకుండా ఉండాల్సింది..
దివ్యకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఈ విషయం హరీష్కు చెప్పింది. దీంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహితుల సమక్షంలో హరీష్, దివ్య ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ కొత్త జంట విశాఖపట్నంలో ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టింది. రెండు నెలల పాటు ఇద్దరూ అక్కడే ఉన్నారు. సొంతూరు వెళితే పెద్దలు ఒప్పుకుంటారన్న నమ్మకమో.. ఏమో తెలియదు గానీ దివ్య, హరీష్ బుధవారం మధ్యాహ్నానికి సొంతూరు తునివాడ వెళ్లారు. ఇద్దరూ కలిసి హరీష్ ఇంటికి నేరుగా వెళ్లారు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరూ కలిసి మేడపై ఉన్న గదిలోకి వెళ్లారు. హరీష్ ఫోన్ కింద మర్చిపోయి వెళ్లడంతో ఫోన్ ఇద్దామని బంధువుల కుర్రాడు పైకి వెళ్లాడు. వెళ్లి చూసేసరికి హరీష్, దివ్య రెండు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులకు సాయంత్రం 4 గంటలకు సమాచారం అందింది.
హరీష్ ఇంటికెళ్లి తప్పుచేశానని తల్లిని పట్టుకుని ఏడ్చేసినట్లు తెలిసింది. విశాఖలో కాపురం పెట్టిన హరీష్, దివ్య ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించారు. రెండు కుటుంబాలు పెళ్లి తర్వాత కూడా ఆదరించకపోవడం వల్లే హరీష్, దివ్య ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పోలీసులు ఈ ఇద్దరిదీ ఆత్మహత్యగానే నిర్ధారించారు. ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఎదురెదురు ఇళ్లలో ఉండే దివ్య, హరీష్ ఆత్మహత్యకు పాల్పడటంతో తునివాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Love marriage, Lovers, Lovers suicide, Srikakulam