news18-telugu
Updated: October 8, 2020, 3:18 PM IST
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
మాదాపూర్ డివిజన్ పోలీసు అధికారులు రెండు చైన్ స్నాచింగ్ ముఠాల గుట్టును రట్టు చేశారు. మొత్తం ముగ్గురుని అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారి వద్ద నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, ఒక హోండా యాక్టివా(TS13EJ2852), హోండా షైన్(TS09BT6801), ప్యాషన్ ప్లస్ బైక్(AP13H0508) బైక్లు, రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుంటూరు ముత్తూట్ ఫినాన్స్ నుంచి 4 తులాల పుస్తెల తాడు రికవరీ చేసుకోవాల్సి ఉన్నట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు ఒక ముఠా అని, మరోకరు వేరే ముఠాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
బ్యాగ్ దొంగిలించిన కేసులో..జూలై నెలలో స్కూటిపై వెళ్తున్న దంపతుల నుంచి బ్యాగ్ దొంగిలించిన కేసులో నిందితులుగా ఉన్న ఏ-1 అఫ్రోజ్, ఏ-2 అమీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తి రీత్యా ఎలక్ట్రిషియన్ అయినా అమీర్పై.. హుమాయిన్ నగర్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు వాహనాల చోరి కేసులు ఉన్నాయి. అతడు ఇటీవల చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఇక, అఫ్రోజ్.. సోహెల్ ఖరేషి మరో వ్యక్తితో కలిసి పలు నేరాలకు పాల్పడ్డాడు. సోహెల్తో కలిసి 12 చైన్ స్నాచింగ్, 4 ఆటోమొబైల్ కేసులు ఉన్నాయి. మొత్తంగా అతనిపై 16 కేసులు ఉన్నాయి. అఫ్రోజ్ కూడా సెంట్రల్ జైలు నుంచి ఈ ఏడాది ఎప్రిల్లో విడుదలయ్యాడు.
అఫ్రోజ్, అమీర్లు జైలు నుంచి విడుదలయ్యాక.. టోలిచౌక్లోని లిమ్రా హోటల్లో కలిసేవారు. ఈ క్రమంలోనే జూలై 29న సాయంత్రం నెంబర్ ప్లేట్ లేని బైక్పై పలు ప్రాంతాల్లో తిరిగారు. పుప్పాలగూడ సమీపంలో దాసరి శిరీష, ఆమె భర్త స్కూటీపై వెళ్తున్నారు. వారిద్దరు తమ మధ్యలో బ్యాగ్ పెట్టుకున్నారు. ఇది గమనించిన అఫ్రోజ్, అమీర్లు బ్యాగ్ను దొంగిలించారు. ఆ బ్యాగ్లో 4 తులాల బంగారంతో పాటు, వన్ ప్లస్ సెల్ఫోన్ ఉండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నేడు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు
పుస్తెలతాడు చోరీ కేసులో..
గత నెల 23న గండిపేట మండలంలో మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు చోరీకి సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. ఏ1- ప్రభుదాస్ అలియాస్ సన్నీ, ఏ2-పెరుమాలపల్లి కృష్ణ, ఏ3- సంజీవయ్యలుగా ఉన్నారు. అయితే వీరిలో పెరుమాలపల్లి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయగా ప్రభుదాస్, సంజీవయ్య పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలు.. సెప్టెంబర్ 23వ తేదీన పుప్పలగూడకు చెందిన మమతా అనే మహిళ మణికొండలోని అక్షయ్ డెంటల్ హాస్పిటల్కు చికిత్స కోసం వెళ్లింది. అనంతరం నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. అయితే ఆమె సెక్రటేరియట్ కాలనీలోని బడ్స్ స్కూల్ సమీపంలోకి రాగానే ఆమె వెనక నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడు తీసుకుని పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చైన్ కొట్టేసిన వారిని పెరుమాలపల్లి కృష్ణ, ప్రభు దాస్లుగా గుర్తించారు. వీరిద్దరి ఆ పుస్తెల తాడును గుంటూరులో వారి బంధువు సంజీవయ్యకు అందజేశారు. అతడు దానిని ముత్తూట్ ఫినాన్స్లో పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అలా వచ్చిన డబ్బును వారు ముగ్గురు పంచుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కృష్ణను అదుపులోకి తీసుకోగా, మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 8, 2020, 3:15 PM IST