విరుధచలం: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చాలా జంటలు అలకలుబుజ్జగింపులతోనో, ఒకరినొకరు అర్థం చేసుకుంటూనో సర్దుకుపోయి సంతోషంగా గడుపుతుంటారు. కానీ కొందరు భార్యాభర్తలు మాత్రం అయినదానికీ, కానిదానికీ గొడవ పడుతూ ఆవేశాలకు లోనవుతూ చేజేతులా కాపురాల్లో అశాంతి అలుముకునేలా చేసుకుని చింతిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరితే హత్యలు, ఆత్మహత్యలకు కూడా దారితీసే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా.. తమిళనాడులోని విరుధచలం పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. విరుధచలం సమీపంలోని పువనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య కలతలే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. విఘ్నేశ్వరన్ అనే 27 ఏళ్ల యువకుడికి పెళ్లైంది. పెళ్లయిన కొన్నాళ్లు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. చీటికీమాటికీ గొడవలు పడుతూ తిట్టుకుంటూ ఉండేవారు.
భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరాయి. ఇక.. నీతో కలిసి ఉండలేనని పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో.. విఘ్నేశ్వరన్ అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఒక్కడే ఉండటంతో ఎంతో ఒంటరితనం అనుభవించాడు. అన్ని రోజులు భార్యాపిల్లలతో కళకళలాడిన ఆ ఇల్లు అలా వెలవెలబోతూ ఉండటాన్ని భరింలేకపోయాడు. ఒక్కడే తనలో తాను కుమిలిపోయాడు. ఇక ఇలా బతకడం వృధా అని భావించి క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు.
పువనూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త రైలు కింద పడి చనిపోయిన విషయం తెలుసుకున్న విఘ్నేశ్వరన్ భార్య అక్కడికి చేరుకుని భర్తను ఆ స్థితిలో చూసి భోరున విలపించింది. ఆమె రోదించిన తీరు హృదయవిదారకంగా అనిపించింది. ఇక.. తనకూ, ఇద్దరు పిల్లలకూ దిక్కెవరంటూ కుమిలిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విఘ్నేశ్వరన్ మృతదేహాన్ని విరుధచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో.. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు ఎంతటి విషాదాంతాలకు దారితీస్తాయో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి గానీ ఇలా ఎవరి దారి వాళ్లు చూసుకోవడం కూడా మంచిది కాదని, కన్న బిడ్డలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విషాద ఘటన రుజువు చేసింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.