Husband Kills Wife: భార్యా- భర్తల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురం ఉండదు. కానీ ఆ మనస్పర్ధలు సద్దుమణిగి కలిసిపోతే అసలు సమస్యే ఉండదు. చిలికి చిలికి గాలివానలా మారితేనే కష్టం. పోనీ ఎవరి మానాన వారు బతికినా పర్వాలేదు. కానీ ఒకరిమీద ఒకరు కక్ష పెంచుకుని.. దారుణమైన చర్యలకు పాల్పడితేనే జీవితాలూ నాశనం అవుతాయి. అలాంటి సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. బాలింత అని కూడా చూడకుండా భార్యను అత్యంత దారుణంగా చంపాడు ఓ భర్త. పండంటి మగబిడ్డను జన్మనిచ్చిన నాలుగో రోజే ఆమెను ఆస్పత్రిలోనే గొంతునులుమి హతమార్చాడు. పంజాబ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన ఈ ఘటన వెలుగుచూసింది.
పంజాబ్(Punjab)రాష్ట్రంలోని కపూరథలా జిల్లాలోని కేసర్పూర్ గ్రామానికి చెందిన బల్వీందర్ కౌర్-మంజిత్ సింగ్ భార్యా భర్తలు. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. కొద్దిరోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంజీత్..తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించేవాడు. ఈ విషయమై భార్యా భర్తల మధ్య అనేకసార్లు గొడవ జరిగింది. అయితే గర్భిణీగా ఉన్న బల్వీందర్ కౌర్(24)..పురిటి నొప్పులతో జూన్ 1న కపూర్థలా జిల్లా ఆస్పత్రిలో చేరింది. అదే రోజు సిజేరియన్ ఆపరేషన్ తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు రోజే. జూన్ 4న శనివారం ఉదయం బాలింత అని కూడా చూడకుండా బల్జిందర్ కౌర్ ని హాస్పిటల్ లోనే గొంతునులిమి హత్య చేశాడు భర్త మంజిత్ సింగ్.
ALSO READ Chicken In Coffee: కాఫీ ఆర్డర్ చేశాడు..తాగుతుంటే అందులో చికెన్ ముక్క కూడా..జొమాటో క్షమాపణ
గైనకాలాజీ వార్డులో ఉన్న ఆమెను తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ముందే మొదట గొంతునులిమాడు. చనిపోయిందో.. లేదో అనే అనుమానంతో మరోసారి మొహంపై దిండుపెట్టి బిగబట్టి ఊపిరాడకుండా చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు హాస్పిటల్ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటన జరిగిన సమయంలో గదిలో నవజాత శిశువుతో పాటు ఓ బాలుడు కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మంజిత్ సింగ్ తన భార్యను అనుమానించేవాడని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డాడని డీఎస్పీ సురీందర్ సింగ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోందని చెప్పారు.
మరోవైపు,తెలంగాణలోని పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని ' అన్నం పెడతానంటూ ఇంట్లోకి పిలిచిన ఓ కామాంధుడు అత్యాచారానికి (Attempted rape) పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లిలో గురువారం చోటుచేసుకుంది . పొత్కపల్లి పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ (Karimnagar) జిల్లా ఇల్లందకుంటకు చెందిన బాలిక ( 11 ) వేసవి సెలవుల నేపథ్యంలో పది రోజుల కిందట ఉప్పరపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది గురువారం ఉదయం కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనులు చేయడానికి వెళ్లారు. చిన్నారి ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి బయట ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన శిలారపు రమేశ్ ( 38 ) ' అన్నం తిందాం రా ' అంటూ పిలవడంతో వెళ్లింది. మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారికి రక్త స్రావం కావడం గమనించి ఆరా తీయడంతో అఘాయిత్యం వెలుగుచూసింది. స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. అస్వస్థతకు గురైన బాలికను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎస్.లక్ష్మణ్ తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకొని కఠిన శిక్షిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Husband kill wife, Punjab