నగౌర్: రాజస్థాన్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న జీప్, లారీ ఢీ కొన్న ఘటనలో 12 మంది మధ్యప్రదేశ్ వాసులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రాజస్థాన్లోని నగౌర్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం గమనార్హం. చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు, మరో ఇద్దరు పురుషులు స్పాట్లోనే చనిపోయారు. బికనీర్లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. నోఖా బైపాస్పై ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం కారణంగా బైపాస్పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. చనిపోయిన వారంతా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా ఘాటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సజ్జన్ ఖేదా, దౌలత్పూర్ గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్లో ట్వీట్స్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జీప్లో పరిమితికి మించి ఎక్కించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ జీప్లో 12 మంది ప్రయాణించడానికి మాత్రమే వీలుంటే.. ట్రావెల్స్ సంస్థ కక్కుర్తితో 18 మందిని ఎక్కించినట్లు తెలిసింది. రాజస్థాన్లోని దేశ్ణోక్ కర్ని మాతను దర్శించుకుని తిరిగి మధ్యప్రదేశ్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జీప్కు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో జీప్ ఎదురు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలు జీప్లో ఇరుక్కుపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Madya pradesh, Rajasthan, Road accident