దేశంలో ఇటీవల పరువు హత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తమ వారిని ప్రేమించారన్న కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిని చంపేయడం లాంటి ఘటనలు అనేకంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, అనంతరం హైదరాబాద్ లో హేమంత్ హత్య ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి మరో దారుణం చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు గత రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న చర్చ స్థానికంగా సాగుతోంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన ఓ యువతి, ప్రణయ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై ఆ యువతి అన్న అనిల్ కు, ప్రణయ్ కు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి ప్రణయ్ కు ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఏమైందో తెలియదు కానీ.. మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న ముళ్ల పొదల్లో అతడు శవమై కనిపించాడు. అయితే ప్రణయ్ ప్రేమించిన అమ్మాయి బంధువులే తమ కుమారుడిని చంపేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి.. శవాన్ని ఇక్కవ వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్ ప్రేమించిన యువతితో పాటు, ఆమె కుటుంబీకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో జరిగిన గొడవ కోణంలోనే విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో పరువు హత్య ఇటీవల కలకలం రేపింది. కూతురుని ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తిని.. తండ్రి కిరాతకంగా హత్య చేయించాడు. వివరాలు.. చందానగర్కు చెందిన హేమంత్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వీరిద్దరు గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కూతురు ఇష్టం ప్రేమ పెళ్లి చేసుకోవడంపై యువతి తండ్రి ఆగ్రహంగా ఉంటున్నాడు. హేమంత్ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో కిరాయి గుండాలతో అతన్ని హత్య చేయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం హేమంత్ను కొందరు వ్యక్తులతో కిడ్నాప్ చేయించాడు. అనంతరం సంగారెడ్డిలో హేమంత్ను దారుణంగా హత్యకు గురయ్యాడు.
హేమంత్ను కిడ్నాప్ చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెంలో సమీపంలోని చెట్లలో హేమంత్ మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం పోస్టు మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని నగరానికి తరలించారు. అలాగే ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక, తాను సమాచారం ఇచ్చినప్పుడు పోలీసులు స్పందించలేదని.. ఒకవేళ స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Honor Killing, Karimnagar