వారిద్దరు ప్రేమించుకున్నారు. మతాలు వేరైనా మనసులు ఒక్కటయ్యాయి. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. వారిని ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతే.. వీరు చేసిన తప్పు అదే..! ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు..ప్రేమ జంటపై అమ్మాయి తరపు బంధువులు దాడి చేశారు. ఆమె భర్తను పబ్లిక్ ప్లేస్లో అతికిరాతకంగా చంపేశారు. గడ్డపారతో పొడిచి దారుణంగా (Hyderabad honor killing) హత్య చేశారు. హైదరాబాద్లో నడిబొడ్డున బుధవారం రాత్రి ఈ ఘోరం (Saroornagar Murder) జరిగింది. తన సోదరుడే భర్తను చంపేయడంతో ఆ యువతికి ఖంగుతింది. తన కళ్లెదుటే భర్త కుప్పకూలడంతో గుండెలు బద్ధలయ్యేలా రోదించింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరైనప్పటికీ.. ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. ఏడేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. ఇంట్లో దీని గురించి తెలియడంతో ఆశ్రిన్ కుటుంబ సభ్యులు నాగరాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ కుమార్తెను వదిలిపెట్టాలని హెచ్చరించారు. కానీ వారు మాత్రం వినలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐతే అంతకంటే ముందు ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకున్నాడు. అనంతరం హైదరాబాద్లోని మలక్పేట ప్రాంతంలో ఓ కార్ల షోరూంలో సేల్స్మ్యాన్గా చేరాడు. ఈ ఏడాది జనవరి 1న అశ్రిన్ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు..తనకు ఉద్యోగం వచ్చిందని, త్వరలోనే పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఈ క్రమంలోనే జనవరి చివరి వారంలో ఆశ్రిన్ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత లాల్ దర్వాజ ఆర్యసమాజ్లో జనవరి 31న వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.
Affair: మాజీ లవర్ తో ప్రాణ స్నేహితుడి ఎఫైర్.. యువకుడు ఏంచేశాడో తెలుసా?
ఆశ్రిన్ ఇంటి నుంచి ముప్పు ఉంటుందని నాగరాజుకు తెలుసు. అందుకే తమను ఎవరూ గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరిద్దరు హైదరాబాద్లోనే ఉంటున్నట్లు ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో.. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లిపోయారు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నారు. తమ కోసం ఎవరూ వెతకడం లేదని నిర్ధారించుకున్న తర్వాత.. ఐదు రోజు క్రితం హైదరాబాద్కు వచ్చారు. సరూర్ నగర్లోని పంజా అనిల్ కుమార్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరు హైదరాబాద్కు వచ్చిన విషయం ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇద్దరి కదలికలను గుర్తించి.. మాటువేశారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్ ఇంటి నుంచి బయటకు వచ్చారు.బైక్పై వెళ్తుండగా జీహెచ్ఎంసీ రోడ్డు ప్రాంతంలో ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. అనంతరం గడ్డపారతో దాడి చేసి హత్య చేశాడు. తీవ్ర గాయాలతో నాగరాజు స్పాట్లోనే మరణించాడు.
Crime News: కళ్లలో కారం కొట్టి డబ్బు దోచుకెళ్లిన దొంగలు.. సీన్ కట్ చేస్తే స్టోరీ అంతా వేరే
ఆశ్రిన్ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన సోదరుడే నాగరాజును హత్య చేశాడని ఆశ్రిన్ చెప్పింది. అనంతరం కాసేపటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని.. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఆశ్రిన్ను నాగరాజు బంధువులు తీసుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరగడం.. అందులోనూ పరువు హత్య కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Honor Killing, Hyderabad, Telangana