దిశ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దిశా కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఐతే ఎన్కౌంటర్ కేసులో ఆధారాల సేకరణపై తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలిస్తామని.. ఢిల్లీ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని వెల్లడించింది.
ఐతే కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ.. రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10.30గంటల్లోపు అభిప్రాయం తెలపాలని ఏజీని ఆదేశించింది హైకోర్టు. అటు రీ పోస్టుమార్టం చేయనున్న నేపథ్యంలో మృతదేహాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. శనివారం జరిగనున్న విచారణకు సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. తెలంగాణ న్యాయ, పోలీసు వ్యవస్థల తీరును ప్రపంచమంతా గమనిస్తోంది ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, దిశా నిందితుల ఎన్కౌంటర్ జరిగి 15 రోజలవుతోంది. వారి మృతదేహాలు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉన్నాయి. డిసెంబరు 6న దిశను తగులబెట్టిన చోటే నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. షాద్ నగర్ మండలం చటాన్పల్లి బ్రిడ్జి సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడిచేసి పారిపోయేందుకు నలుగురు నిందితులు ప్రయత్నించారని పోలీసులు అదే రోజు వెల్లడించారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని.. పోలీసుల జరిగిన ఎదురుకాల్పులో వారు చనిపోయారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Disha murder case, Shadnagar encounter, Telangana