HEART WRENCHING INCIDENT IN MOTIHARI DISTRICT OF BIHAR A CASE HAS BEEN REGISTERED AGAINST 12 PEOPLE SSR
Sad Incident: చూడ చక్కగా ఉన్నారు.. పెళ్లి చేసుకుని వాళ్ల బతుకేదో వాళ్లు బతుకుతుంటే..
పూజ, అవ్నీష్
‘ప్రేమిస్తే చంపేస్తరా.. చంపేస్తరా అని డైలాగులేసినవు కద.. ఇప్పుడు చెప్తున్నా యిను.. చంపేస్తరు’ శేఖర్ కమ్ముల లవ్స్టోరీ సినిమాలో నటుడు ఉత్తేజ్ చెప్పే డైలాగ్ ఇది. కానీ.. నిజ జీవితంలో కూడా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడిని, కొందరైతే కన్న కూతురితో సహా ఇద్దరినీ చంపేంత కిరాతకంగా మారుతున్నారు.
మోతిహారి: ‘ప్రేమిస్తే చంపేస్తరా.. చంపేస్తరా అని డైలాగులేసినవు కద.. ఇప్పుడు చెప్తున్నా యిను.. చంపేస్తరు’ శేఖర్ కమ్ముల లవ్స్టోరీ సినిమాలో నటుడు ఉత్తేజ్ చెప్పే డైలాగ్ ఇది. కానీ.. నిజ జీవితంలో కూడా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడిని, కొందరైతే కన్న కూతురితో సహా ఇద్దరినీ చంపేంత కిరాతకంగా మారుతున్నారు. పరువు పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ ప్రేమ పెళ్లి ఎంతటి విషాదాంతంగా ముగిసిందో అందరికీ తెలిసిందే.
సరిగ్గా.. అలాంటి ఘటనే బీహార్లోని మోతిహారి జిల్లాలో జరిగింది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని ఆమె తండ్రి, సోదరుడు, మరికొందరు కలిసి అల్లుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారు. ప్రాణ హాని ఉందని, భద్రత కల్పించాలని ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ భద్రత కల్పించలేదని.. అందుకే ఈ హత్య జరిగిందనే వాదన వినిపిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మోతిహారి జిల్లాలోని జీతానా పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతౌరా అనే గ్రామంలో పూజ, అవ్నీష్ కలిసి ఉంటున్నారు. పూజను ప్రేమ పెళ్లి చేసుకున్న అవ్నీష్ తల్లిదండ్రుల అంగీకారంతో ఇంటికి తీసుకొచ్చుకుని కాపురం పెట్టాడు. ఈ ఇద్దరికీ ప్రస్తుతం 8 నెలల పాప ఉంది. ప్రేమ పెళ్లి చేసుకున్న సమయంలో పూజ కుటుంబం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైంది. అవ్నీష్ను చంపేస్తామని పూజ కుటుంబ సభ్యులు బెదిరించారు. దీంతో.. తమకు ప్రాణ హాని ఉందని ఈ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. అప్పటి నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో ఇటీవల కూడా రక్షణ కల్పించాలని పోలీసులను పూజ కోరింది. అయినప్పటికీ పోలీసులు భద్రత కల్పించే విషయంలో అలక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లుడిని చంపేందుకు అవకాశం కోసం ఎదురుచూసిన పూజ తండ్రి చివరకు అనుకున్నంత పని చేశాడు.
పూజ తండ్రి, సోదరుడు, మరో 12 మంది కలిసి అవ్నీష్ ఇంటికొచ్చారు. ఇల్లు ధ్వంసం చేశారు. అవ్నీష్ను తిట్టి కొట్టారు. అప్పటికీ కసి తీరక అవ్నీష్ తలను టార్గెట్ చేసి తుపాకీతో నాలుగు బుల్లెట్లను కాల్చారు. దీంతో.. కుప్పకూలిపోయిన అవ్నీష్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న భర్తను చూసి పూజ కుప్పకూలిపోయింది. తన భర్తను ఏం చేయవద్దని పూజ కాళ్లు పట్టుకుని బతిమాలినా ఆమె సోదరుడు, తండ్రి వినిపించుకోలేదు. పూజను, ఆమె అత్తను, మామయ్య ప్రేమ్చంద్ర సింగ్ను కూడా కొట్టి గాయపరిచారు. ఈ దాడిలో అవ్నీష్ తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఐసీయూలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కనీసం స్పృహలో కూడా లేదు.
అవ్నీష్ తండ్రి కాళ్లు విరిగాయి. తలకు బలమైన గాయమైంది. అవ్నీష్ తండ్రి అత్మోహన్ రూరల్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేసేవాడు. ఈ ఘటనపై పూజ మాట్లాడుతూ.. ఘటన జరిగే ముందురోజు తాను పోలీసులను కలిసి రక్షణ కల్పించాలని కోరానని, ఇప్పుడు కూడా పోలీసులు వెళ్లిపోయిన అరగంట తర్వాత ఇంట్లోకి వచ్చి కళ్ల ముందే తన భర్తను చంపేశారని పూజ కన్నీరుమున్నీరయింది. తన పాపను కూడా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని, గ్రామస్తుల సాయంతో పాపను కాపాడుకోగలిగానని ఆమె చెప్పింది. ఈ కేసు బీహార్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో మోతిహారి ఎస్పీ నవీన్చంద్ర ఝా 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.