పెళ్లి జరిగి పట్టుమని 15 రోజులు కూడా అవ్వక ముందే ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ జరగాల్సిన రాత్రే ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఆ పెళ్లి ఇంట్లో పెను విషాదం నిండుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మునిమద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్నకుమారుడు సోమేశ్(27). ఆ యువకుడికి ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన యువతితో వివాహం జరిగింది. ఆ యువతి అతని మేనమామ కూతురే. అయితే వివాహం జరిగిన 11వ రోజైన మంగళవారం రాత్రి అతడికి ఫస్ట్ నైట్ కోసం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అయితే సోమేశ్ తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లి పోయాడు. అలా చెప్పి వెళ్లిన సోమేశ్ ఎంతకూ తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ తో ఇంటికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి బయలు దేరిన సోమేశ్ స్థానికంగా ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడి ఆచూకీ కోసం రాత్రంతా కుటుంబ సభ్యులు వెతికినా ఎక్కడ అతడు కనిపించలేదు.
ఉదయం పాడుబడ్డ ఇంట్లో ఉరికి వేలాడుతూ సోమేశ్ కనిపిండంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆనందంగా పెళ్లి చేసుకున్న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్న అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.