news18-telugu
Updated: June 18, 2019, 5:33 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఢిల్లీలోని వికాస్ పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ముఖంపై యాసిడ్ చల్లిన యువతిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే బాధిత యువకుడు, నిందితురాలు ఇద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురూ ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. కాగా గత కొంత కాలంగా నిందితురాలు, బాధిత యువకుడిని వివాహమాడమని కోరుతోంది. దీనిపై యువకుడు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అంతేకాకుండా యువతి ప్రతిపాదనకు తన కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని అన్నాడు. అయితే బాధిత యువకుడి వయస్సు 19 సంవత్సరాలు కాగా, నిందితురాలి వయస్సు కూడా 18 సంవత్సరాలే కావడం గమనార్హం. అయితే తాను ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నానని, వివాహం కోసం కొంత కాలం ఆగాలని అన్నాడు. దీనికి యువతి ససేమిరా అన్నది. దీంతో యువతితో కొంత కాలం పాటు బాధిత యువకుడు మాట్లాడటం మానేశాడు.
కలత చెందిన యువతి బాధిత యువకుడిని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడికి గురిచేసింది. దీనిపై యువకుడు స్పందించకపోవడంతో...తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన యువతి అతను తరచూ ఇంటికి వెళ్లే మార్గంలో కాపు కాచింది. యువకుడు బైక్ పై వెళుతుండగా అతడిని అడ్డగించి నిలదీసింది. యువతి ప్రవర్తనను యువకుడు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను బైక్ పై వెళుతున్న తన ప్రియుడిపై పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే స్థానికులు యువకుడిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.
Published by:
Krishna Adithya
First published:
June 18, 2019, 5:31 PM IST