వారిద్దరూ స్నేహితులు. ఒకే పార్టీకి చెందిన వారు. అందులో ఒక వ్యక్తి మాజీ ప్రజాప్రతినిధి కూడా. అయితే మద్యం మత్తులో వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాంతో ఆగ్రహించిన మరో వ్యక్తి మాజీ ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి పెంచుకున్న గడ్డానికి నిప్పు పెట్టి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన యాదాద్రిభువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామ మాజీ ఎంపీటీసీ, ఆర్ఎంపీ డాక్టర్ సకినాల సత్యానారాయణ, జాలా గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు ఠాకూర్ ప్రమోద్ సింగ్ ఇద్దరు స్నేహితులు. సత్యనారాయణ నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ ఎంపీటీసీగా పనిచేశారు.
ఆ సమయంలోనే ప్రమోద్ సింగ్ భార్య సైతం జాల గ్రామ ఎంపీటీసీగా ఉన్నారు. ఈ రెండు గ్రామాలు పక్కపక్కనే ఉండడంతో స్నేహితులుగా మారారు. ప్రస్తుతం సత్యనారాయణకు పదవి లేకపోవడంతో దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జాల గ్రామానికి ప్రమోద్ సింగ్,ఎర్రోల సత్యనారాయణ మద్యం తాగేందుకు సత్యనారాయణను జాల గ్రామ సమీపంలోని మైసమ్మగుడి వద్దకు రామన్నాడు. దీంతో సత్యనారాయణ అక్కడికి వచ్చాడు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడంతో సత్యనారాయణ నిరాకరించాడు. ‘గతంలోమనం మందు తాగాం. ఇప్పుడు ఎందుకు తాగవు. అసలు మద్యం తాగకుండా ఈ గడ్డం, కాషాయ వస్త్రాలు ఎందుకంటూ లాగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
సత్యనారాయణ పెంచుకున్న గడ్డంపై ప్రమోద్ సింగ్ మద్యం పోసి అగ్గిపుల్లతో నిప్పు అంటించాడు. దీంతో సత్యనారాయణ మొహాం కొంచెం కాలిపోయింది. దీంతో అతడు చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో సత్యనారాయణ గ్రామానికి వచ్చి తనపై జరిగిన దాడి గురించి గ్రామస్తులకు తెలిపి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే నిందితులు ఇద్దరూ పరారీ కావడంతో హత్యాయత్నం కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇదిలావుంటే.. ఠాకూర్ ప్రమోద్ సింగ్పై గతంలోనే రౌడీషీటర్గా కేసు నమోదయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder attempt, Yadadri