సీఎం జగన్ సొంత జిల్లా.. ఉన్నత చదువులకు వేదిక అయిన ఐఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ట్రిపుల్ క్యాంపస్ లో ఉన్న రెండు విద్యార్థి వర్గాల మద్య ఫైటింగ్ జరగడంతో మిగిలిన విద్యార్థులు భయపడ్డారు. అది కూడా వీధి రౌడీల్లా బార్ లైట్లు, క్రికెట్ బ్యాట్లు, సైకిల్ చైన్లతో ట్రిపుల్ ఈ 3 విద్యార్థులను, ఈ 4 విద్యార్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఈ 3 విద్యార్థులు ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ గొడవకు సంబంధించి స్థానిక విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం కడప జిల్లాలోని ఇడుపులపాయలోని ఐఐఐటీ ఆర్కే వ్యాలీ లో ఇంజనీరింగ్ విభాగంలోని E3, E4 విద్యార్థుల మధ్య మొదట ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మూర్తి, శేషు, రాజు అనే ఈ3 విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్టు సమాచారం. శనివారం ఇద్దరు ఈ3 విద్యార్థులను ఈ4 విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ3 విద్యార్థులందరూ ఈ4 విద్యార్థుల వద్దకు వెళ్లి ర్యాగింగ్ చేయడం తప్పు అని ఖండిచినట్టు సమాచారం. అలా వారికి చెప్పిన తరవాత అక్కడ నుండి వాళ్లు తమ వసతి గృహానికి చేరుకొన్నారు. ఆ వివాదం అక్కడితో సద్దుమణిగిందని అంతా అనుకున్నారు.
అయితే ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో ప్రసాద్ చంద్ర, తేజ, వంశీ, చరణ్, శివాజీతో పాటు మరి కొంత మంది ఈ4 విద్యార్థులు.. ఈ3 విద్యార్థులు ఉండే వసతి గృహానికి వెళ్లారు. ముందు వేసుకున్న ప్లాన్ లో భాగంగా తమ వెంట తెచ్చుకున్న బార్ లైట్స్, క్రికెట్ బ్యాట్లు, సైకిల్ చైన్లతో పాటు ఇతర వస్తువులు తీసుకొని ఈ 3 విద్యార్థుల పై మూకుమ్మడిగా దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
వెంటనే సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఐఐఐటీ సిబ్బంది సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఈ4 విద్యార్థులు వారి మాటలను లెక్క చేయకుండా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కళాశాల వసతి గృహంలో చోటు చేసుకున్న ఘర్షణతో.. ఏం జరుగుతుతోందో తెలియక చుట్టు పక్కల ఉన్న విద్యార్థులు పరుగులు తీశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లు చూస్తుంటే సినిమా షూటింగ్ తరహాలో విద్యార్థులు రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది.
ఈ ఘర్షణలో గాయపడ్డ మూర్తి, శేషు, రాజు అనే ఈ3 విద్యార్థులను ఆర్కే వ్యాలీ సిబ్బంది హుటాహుటిన స్ధానిక ఆర్కే వ్యాలీ ఆసుపత్రికి తరలించారు. స్ధానిక ఆర్కే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. రౌడీల మాదిరి విద్యార్థులు దాడులకు పూనుకున్నారంటే అక్కడి అధికారుల పర్యావేక్షణ ఎంతలా లోపించిందో అర్థం చేసుకోవచ్చు.. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, IIT, Kadapa, Students\