ఢిల్లీ: భార్యాభర్తల మధ్య ఏదో ఒక సందర్భంలో చిన్నచిన్న గొడవలు రావడం సహజం. ఆ గొడవలు అలకలు, బుజ్జగింపులతో ముగిస్తే ఇబ్బంది ఉండదు. కానీ.. ఆలుమగల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగి ఆ గొడవలు చిలికిచిలికి గాలివానగా మారితే అనర్థాలు తప్పవు. తొందరపాటులో క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఢిల్లీకి చెందిన భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కన్నబిడ్డ ప్రాణాలను బలితీసుకుంది. ఢిల్లీలోని ఫతేపూర్ బెరి ప్రాంతానికి చెందిన జ్యోతి, సత్యవీర్ భార్యాభర్తలు. 2011లో వీళ్లిద్దరికీ వివాహమైంది. జ్యోతికి 16 సంవత్సరాల వయసులోనే సత్యవీర్కు ఇచ్చి పెళ్లి చేశారు. జ్యోతిది గురుగ్రామ్లోని రితోజ్ గ్రామం. పెళ్లయిన చాలా ఏళ్లకు ఈ దంపతులకు బాబు పుట్టాడు. ఆ పిల్లాడి వయసు 11 నెలలు. ఈ క్రమంలోనే.. జ్యోతి, సత్యవీర్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కాపురంలో రేగిన కలతల కారణంగా వీళ్లిద్దరూ రోజూ ఏదో ఒక విషయంలో గొడవపడేవారు. ఇరు కుటుంబాల వాళ్లు, ఇరుగుపొరుగు వాళ్లు ఎన్నిసార్లు సర్ది చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. సత్యవీర్, జ్యోతిల 11 నెలల బాబుకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అనారోగ్య కారణంగా పలుమార్లు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. జులై 9న కూడా బాబుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. ఒళ్లు కట్టె కాలినట్టు కాలిపోతుండటంతో జ్యోతి పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని భర్తను కోరింది. అందుకు సత్యవీర్ నిరాకరించాడు.
దీంతో.. భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. ఆ గొడవ కాస్తా పెద్ద వాగ్వాదానికి దారితీసింది. ఆ క్షణికావేశంలో చేతిలో ఉన్న పిల్లాడి గొంతు పిసికి జ్యోతి చంపేసింది. ఇరుగుపొరుగు వాళ్లు వచ్చేసరికి పిల్లాడు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండటంతో ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. పిల్లాడిని తండ్రి చంపేశాడని పోలీసులకు సమాచారం అందింది. రెండోసారి పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు పిల్లాడిని తల్లే చంపేసిందని చెప్పారు. నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు స్పాట్కు చేరుకుని పరిశీలించారు.
విగత జీవిగా ఉన్న పిల్లాడిని చూసి నిర్ఘాంతపోయారు. జ్యోతిని, సత్యవీర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు విచారణలో కూడా ‘నువ్వు చంపావంటే నువ్వు చంపావంటూ’ భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. 11 నెలల బాబును తల్లి జ్యోతే చంపినట్లు తేలింది. పిల్లాడిని ఆసుపత్రికి తీసుకెళ్లమంటే తన భర్త తీసుకెళ్లలేదని.. దీంతో క్షణికావేశంలో తానే హత్య చేసినట్లు జ్యోతి అంగీకరించింది. పోలీసులు జ్యోతిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Mother, Murder