(K.Veeranna,News18,Medak)
సమాజంలో మనుషులు డబ్బు కోసం ఏ గడ్డైనా కరుస్తున్నారు. ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. చివరకు కన్నవాళ్లను పరాయి వ్యక్తులకు అమ్ముకునే దయనీయస్థితికి చేరుకుంటున్నారు. మెదక్(Medak) జిల్లాలో ఓ పసికందు విక్రయం(Baby sale)కేసులో తీగ లాగితే డొంక కదిలింది. ఐదు రోజుల పసి కందు(Five days old baby)ఏమైందని ఆరా తీసిన అధికారులకు మతిపోయే విషయాలు తెలిశాయి. తప్పు చేసిన వ్యక్తులు సమర్ధించుకున్న విధానం చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతాయి.
5రోజుల పసికందు అమ్మకం..
మెదక్ జిల్లాలో ఐదు రోజుల పసికందును గుట్టు చప్పుడు కాకుండా విక్రయించిన విషయం బయటపడింది. నర్సాపూర్ తుకారం తండాకు చెందిన శంకర్ దంపతులకు ఐదు రోజుల క్రితం ఆడ శిశువు పుట్టింది. అయితే పుట్టిన ఆడ శిశువు కావడంతో పాటు అప్పటికే నలుగురు సంతానం ఉండటంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ సాయిలక్ష్మీ హాస్టల్ నిర్వాహకురాలు నాగమణి సంప్రదించాడు శంకర్. ఆమెకు బిడ్డను అప్పగించి అమ్మిపెట్టడమని కోరాడు. మూడ్రోజుల క్రితం నాగమణి విశాఖపట్నంకు చెందిన వ్యక్తికి పసికందును అప్పగించి 40వేల రూపాయలు తీసుకొని బిడ్డ తండ్రి శంకర్కు అందజేసినట్లుగా తెలిపింది. ఈవ్యవహారంలో తనకు ఏమి తెలియదని ..మధ్యవర్తిగా మాత్రమే ఉన్నానని చెప్పింది.
40వేలకు విక్రయించిన తండ్రి..
అంతేకాదు బిడ్డు అమ్ముకోవాలని వచ్చిన తండ్రికి బుద్ధి చెప్పి పంపాల్సిన సాయిలక్ష్మీ హాస్టల్ నిర్వాహకురాలు నాగమణి శంకర్ చేసిన పనిని సమర్ధించింది. నలుగురు సంతానం కలిగిన తాగుబోతు తండ్రికి కలిగిన ఆడ సంతానం జీవితం బాగుండాలని ఈ విధంగా చేశానని సాయిలక్ష్మీ హాస్టల్ నిర్వాహకురాలు నాగమణి తెలిపారు. అయితే ఇదే విషయాన్ని శంకర్ను నిలదీస్తే తనకు పోషించేందుకు డబ్బు లేకపోవడంతో పటాన్చెరులో ఉంటున్న తమ బంధువులకు ఇచ్చానని వాళ్లు హాస్పిటల్ ఖర్చులు ఇచ్చారని సమాధానం ఇచ్చాడు.
తల్లికి దూరం చేసి వైజాగ్కు తరలింపు..
నర్సాపూర్ తుకారం తండాకు చెందిన శంకర్తో పాటు నాగమణి ఇద్దరూ పొంతన లేని సమాధానం చెప్పడంతో మాత,శిశు సంక్షేమశాఖ అధికారులు శంకర్ ఇంటి చుట్టు పక్కల నివసిస్తున్న వాళ్ల నుంచి సమాచారం సేకరించారు. గతంలో కూడా ఈ కిరాతక తండ్రి ఓ పసిపాపను విక్రయించినట్లుగా ఆరోపిస్తున్నారు. అప్పుడు కూడా తన బిడ్డ చనిపోయిందని చుట్టు పక్కల వాళ్లను నమ్మించాడని తెలిపారు. ఇప్పుడు మరోసారి కూడా అదే తీరుగా చెప్పడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని అంగడి బొమ్మల్లా అమ్ముకుంటూ కన్నతల్లికి కడుపుకోతను మిగుల్చుతున్న శంకర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శిశువులను విక్రయించడం చట్టరీత్యనేరం కాబట్టి అతనిపై పోలీస్ శాఖ,సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విక్రయించిన పసిపిల్లలను తల్లి ఒడికి చేర్చాలంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medak, New born baby, Telangana News