సమస్తిపూర్: ప్రాణంగా ప్రేమించామని కొందరు ప్రేమికులు పదేపదే చెబుతుంటారు. భగ్న ప్రేమికులు అయితే.. ఆ భావనను పదేపదే వ్యక్తం చేస్తుంటారు. కానీ.. ప్రాణంగా ప్రేమించిన.. ఆ ప్రేమ కొన్నిసార్లు ప్రాణాన్నే బలికోరుతుంటుంది. అదే ప్రేమ ఆ జంట ప్రేమకథకు ఊహించని ముగింపు పలుకుతుంది. బీహార్లో జరిగిన ఈ ఘటన మరోసారి ఈ చేదు నిజాన్ని రుజువు చేసింది. కారణమేంటో తెలియదు గానీ.. ఇంటి ఓనర్ కూతురిని ప్రేమించిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో అతను అద్దెకు ఉంటున్న అదే రూమ్లో శవమై కనిపించాడు. బీహార్లోని సమస్తిపూర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ యువకుడు చనిపోయినప్పటి నుంచి ఆ యువతి కూడా కనిపించకుండా పోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సమస్తిపూర్ జిల్లా మొహ్ద్దినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్ గ్రామానికి చెందిన ఇంద్ర దేవ్రాయ్ కుమారుడు ముకేష్ కుమార్(25). గత ఐదేళ్లుగా ముకేష్ సమస్తిపూర్లో చదువుకుంటూ అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
అయితే.. ఆ గది అద్దెకు ఇచ్చిన ఓనర్ కుటుంబం కూడా అతనికి అద్దెకు ఇచ్చిన ఇంట్లో కింద పోర్షన్లో ఉండేది. ఆ ఇంటి యజమానికి కాలేజీలో చదువుతున్న కూతురు ఉంది. ఆ యువతికి, ముకేష్కు పరిచయం ఏర్పడింది. అయితే.. ఇద్దరూ ఇంటి వద్ద మాత్రం ఒకరినొకరు తెలియనట్టుగానే ఉండేవారు. ఇద్దరూ కలిసి బయట పార్కుల్లో షికార్లు చేసేవారు. సినిమాలకు వెళ్లేవారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ముకేష్ రూమ్లో ఇద్దరూ శారీరకంగా కూడా పలుమార్లు కలిశారు. అలా బాగా దగ్గరయిన వీరి వ్యవహారం యువతి కుటుంబానికి తెలిసింది. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ముకేష్కు హుకుం జారీ చేశారు. అయితే.. రూం దొరకగానే కొన్ని రోజుల్లో ఖాళీ చేస్తానని.. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా అని ముకేష్ ప్రశ్నించేసరికి.. రూం దొరకగానే వెళ్లిపోవాలని చెప్పి.. కూతురిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. ఆమెకు ఫోన్లో అందుబాటులో లేకుండా చేశారు.
ఇలా ఉండగా.. గురువారం ఉదయం ముకేష్ తను అద్దెకు ఉంటున్న అదే గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. అదే సమయంలో ముకేష్ ప్రేయసి, ఇంటి ఓనర్ కూతురు కూడా కనిపించకుండాపోయింది. ముకేష్ చనిపోయిన విషయం తెలిసి అతని కుటుంబం సమస్తిపూర్కు పెద్ద ఎత్తున తరలివచ్చింది. దీంతో.. ఘటన జరిగిన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్పాట్కు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. ముకేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. ఆ యువతి కుటుంబమే ముకేష్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతని కుటుంబం ఆరోపించింది. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే గానీ.. ముకేష్ది ఆత్మహత్యా, హత్యా అనే విషయంలో స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. ముకేష్ కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనిపించకుండా పోయిన యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Crime news, Lovers, Lovers suicide