ఈ రోజుల్లో అంతా సోషల్ మీడియా (Social Media) హవా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడున్నావారితోనైనా ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం సోషల్ మీడియాతో కలుగుతోంది. ముఖ్యంగా ఫేస్ బుక్ (Facebook) ద్వారా ఫోటోలు, వీడియోలు, అభిరుచులతో పాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారు. అమెరికా (America) లో ఉన్నా అమలాపురంలో ఉన్నా.. క్షణాల్లో స్నేహాలు చిగురిస్తాయి. మాటలు కలుస్తాయి. కొన్నిసార్లు ప్రేమలు కూడా పుడతాయి. ఇదంతా ఒకవైపే.. రెండోవైపు చూస్తే అందమైన అమ్మాయిల ఫోటోలతో చీటింగ్ చేసే కేటుగాళ్లు కూడా ఉంటారు. అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ వస్తే మంచి ఛాన్స్ దొరికిందని భావించిన ఓ యువకుడు దారుణంగా మోసపోయాడు. అంతేకాదు మనోడి ఎకౌంట్ కూడా ఖాళీ అయిపోయింది. అమ్మాయితో ఫ్రెండ్ షిప్ ఏమోగానీ చాటింగ్ లో వైకుంఠం చూపించింది.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రి (Rajahmundry)లోని వీవర్స్ కాలనీకి చెందిన సురేష్ అనే వ్యక్తికి అమెరికా (USA)లోని కాలిఫోర్నియాకు (California) చెందిన జెమ్మా కాషియా ట్రెట్లే అనే పేరుతో ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికా అమ్మాయి నుంచి రిక్వెస్ట్ రావడంతో సురేష్ వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి అతడితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది.
గిఫ్ట్ పేరుతో టోకరా..
ఈ క్రమంలో ఓ రోజునీకు అమెరికా నుంచి రూ.కోటి విలువచేసే గిఫ్ట్ పంపుతున్నాని చెప్పింది. దీంతో మనోడు ఆనందంతో పొంగిపోయాడు. ఐతే గిఫ్ట్ పంపేందుకు కొంతమొత్తంలో ట్యాక్స్ కట్టాలని చెప్పింది. కొంత నగదు తనకు గూగుల్ పే (Google Pay) చేయాలని ఓ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఇలా పది విడతలుగా రూ.3.70 లక్షల వరకు జమ చేశాడు. ఇటీవల మరోసారి డబ్బు కావాలని మెసేజ్ చేయడంతో అనుమానం వచ్చిన సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
సైబర్ క్రైమ్ (Cyber Crime) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మనీ ట్రాన్స్ ఫర్ (Online Money Transfer) చేసిన గూగుల్ పే నెంబర్, అలాగే ఆ నెంబర్ కు అటాచ్ అయిన బ్యాంక్ ఎకౌంట్ వివరాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అమ్మాయిల ఫోటోలతో మేసేజీలు వస్తే నమ్మొద్దని.. ఒకవేళ స్నేహం చేసినా గిఫ్టుల పేరుతో డబ్బులు అడిగితే ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. కొన్ని సైబర్ క్రైమ్ ముఠాలు సోషల్ మీడియా ద్వారా అమాయకులను మోసం చేసి వారి నుంచి డబ్బులు దోచేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.
మ్యాట్రిమోనీ మోసాలు..
ఇటీవల ఏపీలోని కొన్నిచోట్ల మ్యాట్రిమోని వెబ్ సైట్ల ద్వారా అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు వెలుగుచూశాయి. పెళ్లిపేరుతో నమ్మించడం ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందుల పేరుతో డబ్బులు వసూలు చేసి ఫోన్లు స్విఛ్ ఆఫ్ చేయడం వంటి ఘటనల్లో కేసులు నమోదవడమే కాకుండా నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cheating case, East Godavari Dist, Facebook