మైసూరు: అతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐదంకెల జీతం. అందమైన జీవితం. కానీ.. కట్నం కోసం కక్కుర్తి పడ్డాడు. కుటుంబంతో కలిసి భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ఆమెను తిట్టి, కొట్టి నానా రకాలుగా హింసించాడు. అన్నింటినీ భరించిన ఆ యువతి కొన్నాళ్లకు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఏప్రిల్ 4న ఆ యువకుడిని పెళ్లి చేసుకున్న ఆ నవ వధువు మే 3న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెల రోజుల వ్యవధిలోనే ఆ యువతికి యువకుడు, అతని కుటుంబం నరకం చూపించారు. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆ యువకుడు కూడా ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మైసూరు శ్రీరాంపుర ఎస్బీఎం కాలనీకి చెందిన ప్రదీప్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చెప్పుకోదగ్గ జీతమే తీసుకుంటున్నాడు. తల్లిదండ్రులు ప్రదీప్ పెళ్లి చేయాలని నిర్ణయించారు. సంబంధాల కోసం వెతకగా ఆశారాణి అనే యువతి ఫొటోను చూసి ప్రదీప్ ఓకే చేశాడు. ఆ యువతి నచ్చిందని, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం ఖాయం చేయాలని చెప్పాడు. కొడుకు మాట ప్రకారమే ప్రదీప్ తల్లిదండ్రులు ఆశారాణి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, కట్నం ఎంత ఇస్తారో చెప్పాలని బేరసారాలు ఆడారు. అబ్బాయికి మంచి ఉద్యోగం అని చెప్పడంతో ఆశారాణి తల్లిదండ్రులు తాహతకు తగ్గట్టు కట్నమిచ్చి కూతురి పెళ్లిని ఘనంగా జరిపించారు. అమ్మాయి సుఖంగా ఉండాలని అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చారు. ఆ కట్నం డబ్బులు తీసుకున్న కొన్నాళ్లు ప్రదీప్, అతని కుటుంబం ఆశారాణిని బాగానే చూసుకున్నారు. రానురాను ప్రదీప్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అయినదానికీ, కాని దానికీ ఆశారాణి తల్లిదండ్రులను దూషించడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రులను ఏమీ అనవద్దని, విషయమేంటో సూటిగా చెప్పాలని ఆశారాణి నిలదీయడంతో తనకు అదనపు కట్నం కావాలని తన మనసులో ఉన్న నీచపు ఆలోచనను బయటపెట్టాడు. కట్నం అడిగినంత తన తల్లిదండ్రులు ఇచ్చారని, ఇక ఇప్పుడు మళ్లీ డబ్బు అడిగితే తన తల్లిదండ్రులు ఇచ్చుకోలేరని ఆశారాణి ప్రదీప్కు చెప్పింది. అయినప్పటికీ ప్రదీప్ వినిపించుకోలేదు.
అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. చిన్నచిన్న విషయాలకు గొడవ పెట్టుకుని భార్యను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తెలిస్తే బాధ పడతారని భావించిన ఆశారాణి ఆ బాధలను భరిస్తూ వచ్చింది. కానీ.. ప్రదీప్తో పాటు అతని కుటుంబం కూడా ఆమెను వేధింపులకు గురిచేయడంతో నరకయాతన అనుభవించిన ఆశారాణి ఇక చావే శరణ్యమని భావించి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రదీప్, అతని కుటుంబం వేధింపులు తాళలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆశారాణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రదీప్ను అరెస్ట్ చేశారు. అయితే.. కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కైలాసపురంలోని ఖైదీల తాత్కాలిక కేంద్రానికి ప్రదీప్ను తరలించారు. ప్రదీప్ అక్కడే గురువారం నాడు బెడ్షీట్తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ధన దాహం వల్ల బంగారం లాంటి జీవితాన్ని ప్రదీప్ చేజేతులా నాశనం చేసుకున్నాడు. భార్య ఆత్మహత్యకు కారణమై తానూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband, Karnataka, Mysore, Wife