దావణగెరె: ‘వైద్యోనారాయణో హరి’ అంటారు. ప్రాణం పోసే వైద్యుడిని దేవుడితో పోల్చుతూ ఈ మాటన్నారు పెద్దలు. కానీ.. కొందరు వైద్యులు మాత్రం ఇంత గొప్ప వృత్తికి మాయని మచ్చ తెస్తున్నారు. తాము నేర్చుకున్న వైద్యంతో ప్రాణాలు నిలబెట్టాల్సింది పోయి ప్రాణాలు తీసేందుకు తమ మేధస్సును వాడుతున్నారు. కట్టుకున్న భార్యకు హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చి ఆమె ప్రాణం తీశాడో డాక్టర్. సైన్స్ చదువుకుని.. వైద్య విద్యను అభ్యసించి.. మూఢ నమ్మకాల ఉచ్చులో చిక్కుకుని భార్య ప్రాణాన్ని బలిచ్చిన ఓ కర్కోటకుడు ఇతను.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. దావణగెరె జిల్లా న్యామాతి తాలూకా రామేశ్వర గ్రామానికి చెందిన శిల్ప (36), చెన్నేశప్ప (45) భార్యాభర్తలు. 2005లో వీరిద్దరికీ వివాహమైంది. ఇద్దరు పిల్లలు. వృత్తి రీత్యా చెన్నేశప్ప డాక్టర్. అతని భార్య శిల్ప కొన్నేళ్లుగా ‘లో బీపీ’ తో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం క్షీణించినప్పుడు చెన్నేశప్పనే ఆమెకు ఇంజెక్షన్స్ ఇస్తుండేవాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ.. చెన్నేశప్ప అవ్వడానికి డాక్టరే అయినా మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతుండేవాడు. చేతబడి, క్షుద్ర పూజలను విశ్వసిస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతనికి ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి మనిషిని బలిస్తే కుప్పలుతెప్పలుగా డబ్బు పొందుతావని చెన్నేశప్పకు సలహా ఇచ్చాడు. చెన్నేశప్ప కొన్నేళ్లుగా జల్సాలకు అలవాటుపడ్డాడు. పేకాట క్లబ్బులకు వెళ్లడం, తాగుడూ ఇలా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎంతో డబ్బు పోగొట్టుకున్నాడు. బలహీన మనస్తత్వం ఉన్న చెన్నేశప్ప ఆ మాంత్రికుడు చెప్పినట్టు చేస్తే తనకు సంపద సిద్ధిస్తుందని ఆశించాడు. కానీ.. ఎవరిని బలివ్వాలా అని ఆలోచన చేసిన సందర్భంలో ఓ దుర్మార్గపు ఆలోచన అతనికి తట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యనే బలివ్వాలని చెన్నేశప్ప భావించాడు.
అయితే.. తాను హత్య కేసులో దొరికిపోకుండా ఉండాలంటే ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయిందని అందరినీ నమ్మించాలనుకున్న చెన్నేశప్ప అందుకు ఓ ప్లాన్ వేశాడు. తనకు తెలిసిన వైద్యాన్నే భార్య హత్యకు వాడుకున్నాడు. ఫిబ్రవరి 11, 2021న తన భార్య శిల్పకు డెక్సామెథసోన్ ఇంజెక్షన్ ఓవర్డోస్ ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్ చేస్తే అనారోగ్యం నుంచి కోలుకోవచ్చని భార్యను నమ్మించి ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చాడు. భర్త చెప్పిన మాటలు నిజమని ఆమె నమ్మింది. హై డోస్ ఇవ్వడంతో ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె తీవ్ర అనారోగ్యానికి లోనైంది. తన ప్లాన్లో భాగంగా భార్యను ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా నాటకం ఆడాడు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోతుందని తెలిసే అలా చేశాడు. ఆమె ఆసుపత్రికి వెళ్లేలోపే మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే చనిపోయిందని ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య అనారోగ్యంతో చనిపోయిందని మొసలి కన్నీరు కార్చాడు.
శిల్ప చనిపోయిన తర్వాత ఆమె ఎడమ భుజంపై ఇంజెక్షన్ చేసిన గుర్తులు కనిపించడం, ఆమె నోటి నుంచి రక్తంతో కూడిన నురగ రావడంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. పైగా.. ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లకుండానే ఇంటికి తీసుకురావడంతో ఆ అనుమానం మరింత పెరిగింది. శిల్ప మృతిపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చనిపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు విచారణ మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ను సేకరించింది. పది నెలల విచారణ తర్వాత చెన్నేశప్ప చేసిన దారుణ హత్య బయటపడింది. శిల్ప ఓవర్ డోస్లో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల చనిపోయిందని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తేల్చింది. దీంతో.. చెన్నేశప్ప ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దావణగెరె జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. మూఢ నమ్మకాల మాయలో పడి నమ్మి తన వెంట నడిచిన భార్యను చెన్నేశప్ప బలి తీసుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Black magic, Crime news, Husband kill wife, Karnataka