బహ్రైచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పెళ్లై ఏడాది కూడా కాలేదు. భర్తతో సహా అత్తింటి వారిపై ఆ యువతి ఎక్కడ లేని ద్వేషాన్ని పెంచుకుంది. వాళ్లందరినీ చంపాలని ప్లాన్ చేసింది. నేరుగా చంపేందుకు వీలు కాదని భావించి.. టీలో విషం కలిపి ఇంట్లో ఉన్న అందరికీ ఇచ్చింది. ఆమె భర్తతో పాటు మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కానీ.. విషాదం ఏంటంటే.. ఆ టీ తాగిన సంవత్సరంనర వయసున్న పిల్లాడు చనిపోయాడు. ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్రైచ్ తాలూకాలోని మచియాహి గ్రామానికి చెందిన జైశ్వాల్ కుమారుడు పూరన్కు గతేడాది డిసెంబర్లో అనిత అనే యువతితో వివాహమైంది. పెళ్లై సంవత్సరం కూడా కాలేదు. మెట్టినింటిపై ద్వేషాన్ని పెంచుకుంది. భర్తతో సహా అందరినీ చంపాలనుకుంది. ఈ మధ్యే పుట్టింటికెళ్లి సోమవారం తిరిగి అత్తారింటికొచ్చింది. పల్లెటూర్లలో ఉదయాన్నే పనులు చేసుకుని ఛాయ్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. పూరన్ వాళ్లింట్లో కూడా అదే విధంగా రోజూ ఉదయం టీ తాగుతుండేవారు. అనితను టీ పెట్టమని పూరన్ తల్లి చెప్పింది.
అనిత అత్తమామలతో పాటు, అదే ఊరిలో ఉండే పూరన్ సోదరి, సోదరుడు, ఏడాదిన్నర వయసున్న పూరన్ సోదరి కొడుకు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే.. ఉదయాన్నే ఏదో పని మీద పూరన్ బయటకు వెళ్లాడు. ఇంట్లో లేడు. అయితే.. అవకాశం కోసం ఎదురుచూసిన అనిత అందరినీ ఒకేసారి చంపాలనుకుంది. వస్తూ.. వస్తూ సొంతూరి నుంచి తెచ్చుకున్న విషాన్ని ఆ టీలో కలిపింది. అందరికీ అదే ఛాయ్ను గ్లాసుల్లో పోసి ఇచ్చింది. ఏడాదిన్నర వయసున్న పిల్లాడిపై కూడా అనితకు కనికరం కలగలేదు. అనిత విషం కలిపిన సంగతి తెలియని ఆ కుటుంబమంతా టీ తాగారు. టీ తాగిన కొద్దిసేపటికీ అందరూ నురగలు కక్కుకుంటూ కిందపడిపోయారు. ఆ పిల్లాడైతే కొద్దిసేపు గిలగిలా కొట్టుకుని స్పాట్లోనే చనిపోయాడు. ఇంటి పక్కన ఉన్న ఇరుగుపొరుగు వాళ్లు గమనించి అందరినీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. అనితను అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన టీని లీగల్ ఎగ్జామినేషన్ కోసం పంపారు. తన భర్తతో పాటు, అతని కుటుంబంలో ఎవరూ తనకు నచ్చలేదని.. అందుకే అందరినీ చంపాలని నిర్ణయించుకుని టీలో విషం కలిపినట్లు అనిత ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే.. అనిత వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని అందుకు భర్త, అత్తింటి వారు అడ్డుగా ఉన్నారని భావించి చంపాలనుకుందేమోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అయితే అనిత నేరం అంగీకరించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Married women, Tea, Uttarpradesh, Wife