news18-telugu
Updated: July 25, 2020, 1:37 PM IST
ప్రతీకాత్మక చిత్రం
వారిద్దరూ బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజారక్షణలో కీలకంగా వ్యవహారించాలి. కానీ వారే విచక్షణ కోల్పోయి గొడవపడ్డారు. అంతటితో ఆగకుండా అందులో ఒకరు క్షణికావేశానికి లోనై.. ఓ ఉద్యోగి.. తన సహోద్యోగిపైకి తన సర్వీసు రివాల్వర్తో కాల్పులు జరిపాడు. అంతే సహోద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం తాను అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్కు చెందిన కర్నైల్ సింగ్ సీఆర్పీఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్గా, హర్యానాలోని రోహతక్కు చెందిన దశరథ్ సింగ్.. అదే సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఢిల్లీలోని కేంద్రహోంశాఖ కార్యాలయానికి సమీపంలోని లోథ్ ఎస్టేట్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్నారు.
శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో కర్నైల్ సింగ్, దశరథ సింగ్ మధ్య ఏదో విషయమై మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో గొడవ కాస్త ఘర్షణగా మారింది. దీంతో విచక్షణ కోల్పోయిన సబ్ఇన్స్పెక్టర్ కర్నైల్ సింగ్.. ఇన్స్పెక్టర్ దశరథ సింగ్పైకి తన సర్వీసు రివాల్వర్తో కాల్పులు జరిపాడు. దీంతో దశరథ్ సింగ్ కుప్పకూలిపోయాడు. కర్నైల్ సింగ్ తన సహోద్యోగి అయిన దశరథ సింగ్ను కాల్చి చంపనైతే.. చంపాడు గానీ ఒక్క క్షణంలో ఆ తర్వాతేం జరుగుతుందో కళ్లముందు కన్పించినట్టుంది.
వెంటనే తాను సైతం అదే సర్వీసు రివాల్వర్తో కాల్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సరికి ఇద్దరూ అప్పటికే చనిపోయారు. అయితే ఈ ఇద్దరు అధికారులు సీఆర్పీఎఫ్ 122వ బెటాలియన్కు చెందినవారు కావడం గమనార్హం. అయితే ఈ ఘటన కేంద్ర హోంశాఖ కార్యాలయానికి సమీపంలో జరగడంతో అధికారుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
Published by:
Narsimha Badhini
First published:
July 25, 2020, 1:37 PM IST