కాంచీపురం: తమిళనాడులోని కాంచీపురంలో సినీ ఫక్కీలో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఇంట్లో మగవాళ్లు లేని సమయం చూసుకుని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 5 లక్షల డబ్బు, 80 తులాల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. ఇంట్లో ఆడవాళ్లను కత్తులతో బెదిరించి పరారయ్యారు. దొంగతనం జరిగిన ఇల్లు ఓ ప్రభుత్వ అధికారిది కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మేఘనాథన్ అతని కుటుంబంతో కలిసి కాంచీపురంలోని మారుతీనగర్లో నివాసం ఉంటున్నారు. లోకల్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మరో ఇద్దరు సోదరులున్నారు. ఉమ్మడి కుటుంబమంతా అదే ఇంట్లో నివాసం ఉంటోంది.
శ్రీనివాసన్ కాంచీపురం మర్చంట్ రోడ్లో డీఎన్బీఎస్సీ ట్రైనింగ్ సెంటర్ నడుపుతుండగా, మణికందన్ అగ్రికల్చర్ సూపర్టెండెంట్గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 23న ఉదయం యధావిధిగా రోజూలానే అన్నదమ్మలు ముగ్గురూ వారి వారి పనులకు వెళ్లిపోయారు. ఈ అన్నదమ్ముల భార్యలు ముగ్గురూ ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు నల్ల ముసుగులు ధరించిన వ్యక్తులు కత్తులతో మేఘనాథన్ ఇంట్లోకి చొరబడ్డారు. వారిని చూసిన ఇంట్లోని తోడికోడళ్లు ముగ్గురూ భయంతో కేకలేశారు. అరిస్తే కత్తులతో పొడిచి చంపేస్తామని కత్తులతో బెదిరించడంతో సైలెంట్ అయిపోయారు. ఇలా వాళ్లను బెదిరించి డబ్బు, బంగారం, వెండి దోచుకున్నారు.
ఇది కూడా చదవండి: OMG: ఒకప్పుడు ‘బతుకు జట్కా బండి’ లాంటి షోలో కనిపించిన ఈ మహిళ.. ఇప్పుడు..
కాంచీపురం పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారించారు. ఇంటి తలుపు తెరిచి ఉండటం, ఆ సమయంలో ఒకరు వంటగదిలో వంట చేస్తూ ఉండటం, మరో ఇద్దరు మహిళలు టీవీలో సీరియస్ చూస్తూ ఉండటంతో దొంగలు సులువుగా ఇంట్లోకి రాగలిగారని పోలీసుల విచారణలో స్పష్టమైంది. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే దొంగతనం జరిగిన ఇంటికి వెళ్లి పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను చూశారు. ఆ ఫుటేజీలను చూసిన పోలీసులకు ఓ విషయం స్పష్టమైంది.
దొంగతనం జరిగిన కొన్ని గంటల ముందు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఆ ఇంటిని గమనిస్తూ ఉండటాన్ని పోలీసులు సీసీ ఫుటేజీలో గమనించారు. దొంగతనం పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, కొన్ని రోజుల ముందు నుంచి రెక్కీ నిర్వహించి.. ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉండే సమయం చూసి దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఆ దొంగల ఆచూకీని కనుగొనే పనిలో ఉన్నారు.
ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయాక ఒంటరిగా ఉండే గృహిణులు ఇంటి తలుపులు లాక్ చేసుకుని ఉండటం ఎందుకైనా మంచిదని, తలుపు తీసి ఉంచడం వల్లే ఈ దొంగతనం చేసేందుకు దొంగలకు అవకాశం దొరికిందని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లోనే ఇలా పెద్ద మొత్తంలో దొంగతనం జరగడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని.. కీలక ఆధారాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈ దొంగతనం కాంచీపురంలో హాట్టాపిక్గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gold robbery, Tamilnadu, Tv serials