ఎవరైనా బిర్యానీలో మసాలాను, ముక్కలను ఎంజాయ్ చేస్తారు.. కొందరు గ్రేవీ(షొర్వా) కలుపుకోడాన్నీ ఇష్టపడతారు.. కానీ వీడు మాత్రం బిర్యానీలో కలిపి నగలు మింగేశాడు!! అవును, బిర్యానీ ప్లేట్లో వేసుకొని తింటున్నట్లు నటిస్తూ గదిలో కలియదిరిగి చేతికందిన నగల్ని మటన్ ముక్కలతో కలిపి మింగేశాడు. ఈద్ (రంజాన్) పార్టీ కోసం మేనేజర్ ను ఇంటికి ఆహ్వానిస్తే ఆమె ప్రియుడు చేసిన నిర్వాకమిది. ఉద్యోగం పోతుందనే భయంతో చివరికి బాధితురాలు ఫిర్యాదు కూడా వెనక్కి తీసుకుంది. వివరాలివి..
ఈద్ పార్టీకి పిలిస్తే బిర్యానీతోపాటు విలువైన నగలనూ మింగేసిన వింత ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో చోటుచేసుకుంది. సిటీలోని సాలిగ్రామం ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం మహిళ పేరుమోసిన జువెలరీ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నది. మొన్న 3వ తారీకున ఈద్(రంజాన్ పండుగ) సందర్భంగా తన సహచరులకు ఆమె విందు ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి మేనేజర్ అయిన మరో మహిళను కూడా ఆహ్వానించింది. భర్త లేని ఆ లేడీ మేనేజర్ కొంతకాలంగా ఓ యువకుడితో రిలేషన్ లో ఉంది. వాణ్ని వెంటేసుకొని ఈద్ పార్టీకి వెళ్లడమే ఆమె చేసిన పొరపాటు..
ఇంటికి వచ్చిన అతిథులందరికీ రుచికరమైన బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను వడ్డించింది హోస్ట్ అయిన మహిళ. మేనేజర్ గారి బాయ్ ఫ్రెండ్ కావడంతో మనోడికి నాలుగు ముక్కలు ఎక్కువే వేశారు. అప్పటికే మద్యం సేవించి పార్టీకొచ్చిన సదరు మేనేజర్ ప్రియుడు.. బర్యానీ ప్లేటును చేతిలో పట్టుకొని అటు ఇటూ తిరుగుతూ ఇంట్లోని ఓ గదిలో కప్ బోర్డులో ఉన్న రూ. 1.45 లక్షల విలువ చేసే నెక్లెస్, బంగారు గొలుసును బిర్యానీలో కలిపి మింగేశాడు.
ఈద్ పార్టీ ముగిశాక.. వచ్చిన అతిథులందరూ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాధితురాలు వేరే వస్తువు కోసం కప్బోర్డు తెరిచి చూసేవరకు అక్కడ ఉండాల్సిన నగలు కనిపించలేదు. ఒక్క క్షణం షాక్ కు గురైన ఆమె అతిథుల్ని ఆపి జరిగిన విషయం చెప్పింది. అందరూ మాకేం తెలీదంటే మాకేం తెలీదని స్థిరంగా చెప్పారు. అందరి సమ్మతితోనే విరుగంబాకం స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా అనుమానితులపై ఫోకస్ పెట్టారు..
మేనేజర్ గారి ప్రియుడు కొద్ది నిమిషాల పాటు నగలున్న గదిలో తలుపులు వేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతణ్ని తమదైన శైలిలో ప్రశ్నించగా.. బిర్యానీతోపాటు నగలనూ మింగేసినట్లు ఒప్పుకోక తప్పలు. ఆ తర్వాత అతణ్ని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు స్కానింగ్ చేయగా కడుపులో నగలు స్పష్టంగా కనిపించాయి. చివరికి ఎనిమా ఇచ్చి కడుపులోని బిర్యానీతోపాటు రూ.95వేలు విలువ చేసే బంగారు హారం, రూ.25 , రూ.20వేలు విలువ చేసే రెండు గొలుసులను వెలికితీశారు.
ప్రియుడి నిర్వాకంతో పరువు పోయిన లేడీ మేనేజర్ ఏం చెప్పిందోగానీ చివరికి బాధిత మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు పోలీసులకు చెప్పింది. నగలు దొరికినందున ఈ కేసులో తానిక ముందుకు పోలేనని, దయచేసి కేసును క్లోజ్ చేయాల్సిందిగా పోలీసులను అభ్యర్థించింది. తదుపరి ఎలా ముందుకెళ్లాలనే దానిపై పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Gold, Gold jewellery, Ramadan 2022, Tamil nadu