కొల్లాం: కేరళలో విషాద ఘటన జరిగింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ వ్యక్తిపై తాగి నిద్రపోతున్నావంటూ అకారణంగా కండక్టర్ దాడి చేయడంతో అవమాన భారం తట్టుకోలేక సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లా భారతీపురం అనే గ్రామానికి చెందిన ఆని అనే 46 సంవత్సరాల వయసున్న వ్యక్తి కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో అనారోగ్యానికి లోనయ్యాడు. తిరువనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సొంతూరి నుంచి తిరువనంతపురానికి అప్పుడప్పుడూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
నవంబర్ 24న ట్రీట్మెంట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు తిరువనంతపురం నుంచి బస్సు ఎక్కాడు. దూర ప్రయాణం. పైగా అనారోగ్యంతో ఉన్న మనిషి కావడంతో కొంత బడలికగా అనిపించి బస్సులో వెనుక సీటులో నిద్రపోయాడు. టికెట్లు ఇచ్చేందుకు అటూఇటూ తిరుగుతున్న కండక్టర్ సోయి లేకుండా నిద్రిస్తున్న ఆనిని చూసి తాగి మత్తులో పడుకున్నాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు. చేతిలో ఉన్న టికెట్ మిషన్తో ఆని తలపై కొట్టాడు. ‘ఏమైంది సార్ అని ఆని అడగ్గా.. తాగి నిద్రపోతున్నావా.. మందు తాగి బస్సులెందుకు ఎక్కుతారంటూ ఆ కండక్టర్ అతనిని దుర్భాషలాడాడు. అంతేకాకుండా.. ఆని చెప్పేది వినిపించుకోకుండా దాడి చేశాడు. తాను పేషంట్నని.. ఆరోగ్యం బాగోలేక ఇలా పడుకున్నానని చెప్పినా కండక్టర్తో పాటు బస్సులో ఉన్న వాళ్లెవరూ వినిపించుకోలేదు. బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందుకు తీసుకెళ్లి ఆపారు. కండక్టర్ ఫిర్యాదుతో పోలీసులు ముందూవెనుకా ఆలోచించకుండా ఆనిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. అతనికి జరిమానా కూడా విధించారు.
ఆ తర్వాత ఆని పోలీసులకు తాను పేషంట్నని.. కావాలంటే రిపోర్ట్స్ చూడండని చూపిస్తే అప్పటికి అర్థం చేసుకున్నారు. అతనికి విధించిన జరిమానాను వెనక్కి తీసుకున్నారు. అయితే.. బస్సులో అందరి ముందు అంత అవమానం జరగడం, తనపై కండక్టర్ దాడి చేయడం.. తాగుబోతు అని ముద్ర వేయడం.. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంతో ఈ పరిణామాలన్నీ ఆనిని తీవ్రంగా బాధించాయి. ఇంటికి వెళ్లాక కూడా నిద్రపట్టలేదు. చివరికి ఇంత అవమానం జరిగాక బతికి ఉండటం ఎందుకని భావించిన ఆని క్షణికావేశంలో గత శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు.
ఆనిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆని మంగళవారం ఉదయం చనిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆని ప్రాణం పోవడానికి కారణం ఆ బస్సు కండక్టరేనని.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేఎస్ఆర్టీసీ కండక్టర్ ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆనికి భార్య సుమంగళ, కొడుకులు అభిజిత్, అభినంద్ ఉన్నారు. ఊహించని ఈ ఘటన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Kerala, RTC buses, Suicide