నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై అనుమానిత టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పసుపు బోర్డు విషయంలో మోసం చేసినందుకు రైతులే తిరగబడ్డారని టీఆర్ఎస్ నేతలు అన్నారు..
పసుపు బోర్డు వివాదం నిజామాబాద్ రాజకీయాల్లో రచ్చకు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై అనుమానిత టీఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ అర్వింద్ నందిపేట్ మండలం నూత్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళుతుండగా రైతులు ఆయన వాహనాన్ని అడ్డుకోగా, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
దాడి ఘటనలో ఎంపీ అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, గొడవ చోటుచేసుకుంది. ఇరువర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆర్మూర్లో బీజేపీ నేతలు రాస్తా రోకో చేశారు. ఎంపీ కారుపై దాడి ఘటనను బీజేపీ బడా నేతలు సైతం ఖండించారు. అయితే, పసుపు బోర్డు విషయంలో మోసం చేసినందుకు ఎంపీపై రైతులే తిరుగుబాటు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని.. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు.
ఈ విషయంపై పోలీస్ కమిషనర్, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప్రేక్షకపాత్ర వహించారన్నారు. పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని అర్వింద్ ఆరోపించారు. ఈ ఘటనపై లోక్సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని.. తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని అర్వింద్ చెప్పారు. ఈ ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలపై మర్డర్ కేసు పెట్టాలంటూ బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేశారు.
కాగా, ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్నది పసుపు రైతులే అని, పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్లు రాసిచ్చిన అర్వింద్, ఎంపీగా గెలిచాక రైతుల్ని మోసం చేశాడని అందుకే రైతులు ఎంపీని నిలదీశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఎంపీ అర్వింద్ పర్యటన సందర్భంగా మంగళవారం ఆర్మూర్ లోని పలు పల్లెల్లో పసుపు మంటలు రాజుకున్నాయి. అర్వింద్ కు వ్యతిరేకంగా పసుపు రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.