BIG SHOCK TO MAOISTS SIX GUN MANS ARRESTED BY VISAKHA DISTRICT POLICES NGS
Breaking News: ఏవోబీలో ఆరుగురు మావోయిస్టులు అరెస్ట్.. వీరిలో అగ్రనేత గన్మెన్లు? పట్టు సడలిందా..?
ప్రతీకాత్మక చిత్రం
ఏవోబీలో ఏం జరుగుతోంది. వరుస పరిణామాలు మావోయిస్టులను కోలుకోని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా కీలక నేతకు చెందిన ఆరుగురు గన్ మెన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మావోయిస్టులు పట్టు కోల్పోడానికి కారణం అదేనా..?
ఏవోబీపై మావోయిస్టులు పట్టు సడలుతోంది. పోలీసుల వరుస కూంబింగ్ లు.. ఎన్ కౌంటర్లకు తోడు.. కరోనా కాటు వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు కీలక మావోయిస్టులను విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్మెన్లు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఏవోబీలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్య నాయకుల లొంగుబాట్లు, అరెస్టులు, ఎదురుకాల్పులతో ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా ఆ పార్టీ చాలా క్యాడర్ను కోల్పోయింది. వీటికితోడు కరోనా పంజా.. మరోవైపు స్థానిక ఆదివాసీల నుంచి నియామకాలు లేకపోవటంతో మావోయిస్టులకు పట్టు తగ్గుతోంది. ఈ అరెస్టులకు ముందు ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవటం, వారిలో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు (డీసీఎం) స్థాయి నాయకులు ఉండటం ఆ పార్టీకి పెద్ద దెబ్బే. కొన్నేళ్లుగా ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే ఏవోబీలో మావోలు పూర్తిగా పట్టుకోల్పోయినట్టే అని ఆ పార్టీ సానుభూతిపరులే చెబుతున్నారు.
2016 అక్టోబరు 23న ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో ఆ వెంటనే ఛత్తీస్గఢ్ నుంచి 60-70 మంది క్యాడర్ను ఏవోబీలో దించింది. తర్వాత ఉనికి చాటేలా పలు ఘటనలకు పాల్పడింది. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హతమార్చింది. అయితే ఏవోబీ భౌగోళిక పరిస్థితిపై వీరికి పట్టు చిక్కకపోవటం, భాష అవరోధంగా మారటంతో అక్కడ పాగా వేయడం సాధ్యపడలేదు. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న కటాఫ్ ఏరియాలో ఒడిశా వైపు నుంచి నిర్బంధం పెరగటం, ఏపీ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్లు అధికమవ్వటంతో ఆ ప్రభావం మావోయిస్టుల సంస్థాగత నిర్మాణాన్ని దెబ్బతీసింది.
ఏవోబీలో గతంలో కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం, గాలికొండ, పెదబయలు, గుమ్మా, బోయిపరిగూడ పేర్లతో మొత్తం 8 ఏరియా కమిటీలుండేవి. వాటిలో నాలుగే మిగిలాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) రెండు కంపెనీలుండేవి. ఇప్పుడు 10 మందితో కూడిన ఒక ప్లటూన్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో గతంలో మొత్తం 160-180 మంది క్యాడర్ ఉండేది. ఇప్పుడు అందులో సగమే మిగిలిందనేది పోలీసుల మాట. గత రెండేళ్లలో ఏవోబీలో 8 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయి. వాటిలో 8మంది మావోయిస్టులు చనిపోయారు. వివిధ క్యాడర్లలోని ఆరుగురు అరెస్టయ్యారు. 31 మంది లొంగిపోయారు. మొత్తంగా ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు ఒకరు, నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 8 మంది ఏరియా కమిటీ సభ్యులు 8 మంది, 30 మంది దళం సభ్యులు పార్టీకి దూరమయ్యారు.
ఏవోబీలో నాయకత్వ స్థానంలో కీలకంగా ఉంటూ ప్రత్యేక జోనల్కమిటీ సభ్యుడి స్థాయిలో ఉన్న ఎం.జలంధర్రెడ్డి ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందు మరో ముఖ్యనాయకుడు, డివిజనల్ కమిటీ సభ్యుడు అంజయ్య అలియాస్ నవీన్ లొంగిపోయారు. గాలికొండ దళంలో కీలక నాయకుడైన గెమ్మలి కామేష్ అలియాస్ హరి గతేడాది సెప్టెంబరులో పోలీసులకు పట్టుబడ్డారు. మిలీషియా కమాండర్గా ఉండే వంతల కామేశ్వరరావు, మరో కమాండర్ కొర్రా మల్లేశ్వరరావు అరెస్టయ్యారు.2019 సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు, 2020 నవంబరులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందారు. ఏవోబీలో నాయకత్వానికి, క్షేత్రస్థాయిలో నిర్ణయాలు అమలుచేస్తున్న బాధ్యులకు మధ్య సమన్వయం కొరవడి అభిప్రాయ భేదాలు పెరిగాయి. అంతకుముందు కటాఫ్ ఏరియాలోని సురక్షిత స్థావరాల్లో తలదాచుకుని అవసరమైనప్పుడు ఏపీ వైపు వచ్చి కార్యకలాపాలు నిర్వహించి మళ్లీ వెనక్కి మళ్లిపోయేవారు. కటాఫ్ ఏరియాలో ఒడిశా ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించడంతో అక్కడా వీరు పట్టు కోల్పోయారు. వీటిన్నింటికీ తోడు ఇటీవల భారీగా మావోయిస్టులు కరోనా భారీన పడ్డారు. వారిలో చాలమందికి చికిత్స కూడా అందని పరిస్థితి కనిపించింది. దీంతో చాలామంది మావోయిస్టులు ఉద్యమం నుంచి బయటకు వచ్చినట్టు ప్రచారం ఉంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.