సెలవుపై ఇంటికొచ్చిన ఆ ఆర్మీ జవాన్ చాలా కాలం తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ కు వెళ్లాడు.. ఆర్మీ జవాన్ అనే గౌరవంతో స్కూల్ డైరెక్టర్ ప్రత్యేకంగా అతనితో మాట్లాడాడు.. అయితే అప్పుడు కూతురు చెప్పిన మాటతో జవాన్ ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు.. ముందూ వెనకా చూడకుండా తుపాకి తీసి డైరెక్టర్ పై కాల్పులు జరిపాడు.. కానీ బుల్లెట్ తగిలింది మాత్రం ఆ జవాన్ భార్యకే. రాజస్థాన్ లో సంచలనం రేపిన స్కూల్లో కాల్పులు ఘటనలో కోపధారి ఆర్మీ జవాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్కూల్ యాజమాన్యం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలివి..
రాజ స్థాన్ లోని భరత్పూర్ జిల్లాలో కన్వాడా గ్రామానికి చెందిన పప్పూ గుర్జార్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. సెలవులపై ఇటీవలే ఇంటికొచ్చిన అతను సోమవారం నాడు తన కూతురు చదివే ప్రైవేటు స్కూలుకు వెళ్లాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ నిమిత్తం ఆర్మీ జవాన్ భార్య కూడా స్కూలుకు వెళ్లింది. పప్పూ ఆర్మీ వ్యక్తి కావడంతో ఆ స్కూల్ డైరెక్టర్ మర్యాదగా తన గదిలోకి పిలిచి మాట్లాడాడు..
ఆ సమయంలో ఆయన కూతురు హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టిన విషయాన్ని పప్పూకు చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆర్మీ జవాన్.. స్కూల్ డైరెక్టర్పై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పప్పూ భార్య అడ్డు రావడంతో ఆమె భుజంలోకి బుల్లెట్ దిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కూతుర్ని టీచర్ కొట్టాడనే కోపంతో స్కూల్ డైరెక్టర్ పై కాల్పులు జరిపి, భార్యను గాయపర్చిన నేరానికిగానూ ఆర్మీ జవాన్ పప్పూ గుర్జర్పై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గుర్జర్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నాడని, సర్విస్ తుపాకీ కూడా తనతోనే ఉందని తెలిపారు. సాధారణ పౌరుడిపై జవాన్ కాల్పులు, అతనిపై కేసు వివరాలను ఆర్మీ వర్గాలకు కూడా రిపోర్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.