యూపీ: ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) ఇతా(Etah District) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దేశ సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాను (Army Soldier) వైవాహిక జీవితం (Marriage Life) విషాదాంతమైంది. భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం శోచనీయం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇతా జిల్లా బిజోరి గ్రామానికి చెందిన అరవింద్ చౌహాన్(24) జమ్మూకాశ్మీర్లోని రాజౌరి(Rajouri) మిలటరీ క్యాంపులో ఉరేసుకుని చనిపోయాడు. భార్యతో ఏర్పడిన గొడవల కారణంగా.. తీవ్ర మనస్తాపంతో ఈ యువ జవాను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది.
అరవింద్ చౌహాన్ సెంట్రల్ కశ్మీర్లోని గందెర్బాల్ జిల్లాలోని మానస్బల్ ప్రాంతంలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. 2017లో అరవింద్ ఆర్మీలో చేరాడు. అరవింద్ తండ్రి కూడా ఆర్మీలో సుబేదారుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అరవింద్ సోదరుడు కూడా ఆర్మీలోనే విధులు నిర్వహిస్తున్నాడు. అరవింద్కు 2019లో పెళ్లైంది. పిల్లలు లేరు. అరవింద్కు, అతని భార్య ఆర్తీకి(20) పెళ్లైన కొన్ని నెలలకే మనస్పర్థలొచ్చాయి.
తాను అత్తారింట్లో ఉండనని భర్తకు తెగేసి చెప్పిన ఆర్తి అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. ఆర్తితో దగ్గరయ్యేందుకు.. ఆమెకు సర్ది చెప్పేందుకు అరవింద్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ.. ఆర్తి తాను అత్తారింటికి రానంటే రాననే సరికి అరవింద్ తీవ్ర మనస్తాపం చెందాడు. భార్య వైఖరితో విసిగిపోయి మిలటరీ క్యాంపులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయిన విషయం తెలుసుకుని ఆర్తి కుప్పకూలిపోయింది.
భర్తను చివరిసారి చూసేందుకు ఆర్తి.. అరవింద్ వాళ్ల ఊరు వెళ్లింది. అయితే.. అరవింద్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్తిని అక్కడి వారు అనుమతించకపోవడంతో ఆమెకు కట్టుకున్న భర్త చివరిచూపు కూడా దక్కలేదు. ఈ పరిణామంతో ఆర్తి తీవ్ర మనోవేదనకు గురైంది. తన వల్లే భర్త చనిపోయాడని కుమిలిపోయింది.
అరవింద్ చనిపోవడానికి తానే కారణమని సన్నిహితులకు చెప్పుకుని వెక్కివెక్కి ఏడ్చింది. భర్త చివరిచూపు కూడా దక్కలేదని రోదించింది. తన వల్లే అరవింద్ చనిపోయాడని.. తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. అరవింద్ చనిపోయిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఆర్తి కూడా చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టానికి తరలించారు. భర్త చనిపోయినప్పటి నుంచి ఆర్తి ముభావంగా ఉందని.. ఎవరితో సరిగ్గా మాట్లాడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
గదిలో కూర్చుని ఏడుస్తూ కుమిలిపోయిందని చెప్పారు. అరవింద్, ఆర్తికి 2019 జనవరి 29న వివాహమైంది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం, ఆర్తి పుట్టినింటికే పరిమితం కావడం జరిగింది. భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలు ఇద్దరి ప్రాణాలనూ బలితీసుకున్నాయి. అరవింద్ చనిపోయాడన్న మనోవేదనతోనే ఆర్తి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, Crime news, Husband commits suicide, Uttar pradesh, Wife suicide