హైదరాబాద్ లోని ప్రఖ్యాత కాసు బ్రహ్మానందరెడ్డి ( కేబీఆర్) పార్కులో టాలీవుడ్ నటి, మోడల్ షాలూ చౌరాసియాపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2లోని కేబీఆర్ పార్కులో జాగింగ్ చేస్తోన్న ఆమెపై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. ఊహించని చర్యకు బిత్తరపోయిన నటి.. భయంతో కేకలు వేసింది. దుండగుడితో నిమిషాలపాటు పెనుగులాడింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ఖరీదైన ప్రాంతం కావడం, చుట్టు పక్కలంతా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు నివసిస్తుండటంతో కేబీఆర్ పార్కుకు సెలబ్రిటీల తాకిడి ఎక్కువ. అలాంటి చోట ఇలాంటి ఘటన జరగడంతో అందరూ షాకయ్యారు..
షాలూ చౌరాసియా కేబీఆర్ పార్కులో జాగింగ్ చేస్తుండగా నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై దుండగుడు దాడి చేశాడు. పెనుగులాటలో నటికి గాయాలయ్యాయి. నిమిషాల పాటు సాగిన దాడిలో చివరికి దుండగుడు నటి సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. గాయాలతోనే పార్కు బయటికి వచ్చి నటి.. అక్కడున్నవారి సహాయంతో 100 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ దుండగుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం రాత్రి 8.30 సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
కేబీఆర్ పార్కులో దుండగుడి దాడిలో గాయపడ్డ నటి చౌరాసియాను దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉదయం, సాయంత్రం వేళలో సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఎక్కువగా కనిపించే కేబీఆర్ పార్కులో ఇలాంటి ఘటన కలకలం రేపింది. గతంలో ఈ పార్కు లో పలు హత్యలు జరగ్గా, చాలా ఏళ్ల కిందటే పార్కు చుట్టూ ఫెన్సింగ్ వాల్ నిర్మించి, లోపల సుదీర్ఘమైన వాక్ వేను నిర్మించారు. నటి చౌరాసియాపై దాడికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress, Attack, Heroine, Hyderabad, Hyderabad police, Tollywood actress