కుశీనగర్: భార్యాభర్తల బంధం కలకాలం కొనసాగాలంటే వారి మధ్య అనుమానం తలెత్తకుడదు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి వస్తే ఆ కాపురంలో కలతలు మొదలవడం ఖాయం. రోజూ ఒకరిని ఒకరు అనుమానంతో నిందించుకుంటూ చేజేతులా కొన్ని జంటల వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నాయి. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగితే క్షణికావేశంలో ఒకరినొకరు చంపుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్లే కాపురంలో ఇలాంటి అశాంతి రేగుతుంది. ఆ అశాంతి కారణంగా గొడవలు జరిగి బంగారం లాంటి జీవితాలను క్షణికావేశంతో ముగిస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డలను కూడా పొట్టనపెట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని కుశీనగర్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.
కూరగాయలు కోసే కత్తితో ఓ భర్త తన భార్యాపిల్లల గొంతు కోశాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు ఆ తల్లీబిడ్డల మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించారు. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనన్న అనుమానంతో ఆమె భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుశీనగర్ జిల్లా తుర్క్పత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని భలూహీ గ్రామానికి చెందిన రాజేష్ గుప్తా(35) కొన్నేళ్ల నుంచి ఛండీగర్లో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో అతని తల్లి మరణించడంతో అప్పటి నుంచి భార్యాపిల్లలతో కలిసి రాజేష్ గుప్తా సొంతూరిలోనే ఉంటున్నాడు.
అతనికి భార్య నిక్కీ గుప్తా(30), ఏడేళ్ల కొడుకు శివం, మూడేళ్ల బాబు ఆయుష్ ఉన్నారు. గత సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కూరగాయల కత్తితో భార్యాపిల్లల గొంతు కోసి.. వాళ్లు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించి బాధితురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు విచారణ మొదలుపెట్టారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. రాజేష్ గుప్తా, నిక్కీ మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరిగాయని, భార్యపై రాజేష్ గుప్తా అనుమానం పెంచుకున్నాడని పోలీసులు చెప్పారు. తన భార్య ఊరిలో ఎవరితోనో వివాహేతర సంబంధం నడుపుతుందని రాజేష్ భావించేవాడని, ఆ విషయంలోనే భార్యతో గొడవ పెట్టుకునేవాడని తెలిపారు.
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారిందని.. ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఎవరూ లేకపోవడంతో సర్ది చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు. ఈ గొడవ కారణంగా భార్యపై ఎంతో కోపం పెంచుకున్న రాజేష్ గుప్తా క్షణికావేశంలో తొలుత భార్య గొంతు కోశాడని, ఆ తర్వాత భయంతో పారిపోతున్న ఇద్దరు పిల్లలను కూడా కనీస కనికరం లేకుండా అదే కత్తితో గొంతు కోసి హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఇలా అనుమానం పెను భూతంగా మారి కట్టుకున్న భార్యను, కన్న కొడుకులను అత్యంత దారుణంగా హతమార్చేలా రాజేష్ గుప్తాను ఉసిగొల్పింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Extra marital affair, Husband kill wife, Married women, Uttar pradesh