K.Veeranna,News18,Medak
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ అనేది రెండక్షరాల పదం మాత్రమే కాదు. రెండు స్వచ్ఛమైన మనసుల కలయిక. అయితే ఈ ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ప్రేమించిన అమ్మాయి తరువాతే ఎవరైనా, ఇంకేదైనా అనే ఫీలింగ్ ప్రేమికుల్లో ఉంటుంది. ఈ ప్రేమల్లో కొన్ని విజయతీరాలకు చేరగా..మరికొన్ని అర్ధాంతరంగా మధ్యలోనే విషాదాంతంగా మిగిలిపోతాయి. పెద్దలు ఒప్పుకోలేదని కొన్ని ప్రేమ జంటలు లేచిపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలెన్నో. ఇక ప్రేమించిన అమ్మాయి దక్కలేదని తనువు చాలించిన ప్రేమికులు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియునితో కలిసి పారిపోయిన ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి జీవించలేనప్పుడు కనీసం కలిసైనా చనిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంటకు రెండు పదుల వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఈ ఘటన స్థానికుల చేత కంటతడి పెట్టించింది.
మెదక్ కు చెందిన ఖలీల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో కల్పన అనే అమ్మాయితో ఖలీల్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొన్నిరోజులుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఇదే సమయంలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇంతలో ఈ విషయం కాస్త ఇద్దరి ఇళ్లల్లో తెలిసింది. కానీ ఇద్దరు మతాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబసభ్యులు పెళ్లికి ససేమిరా అన్నారు. ఈ క్రమంలో కల్పనకు 2 నెలల క్రితం వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. ప్రేమించిన ఖలీల్ ను మనసులో పెట్టుకొనే పెద్దలు చూసిన అబ్బాయిని ఇష్టం లేకున్నా పెళ్లాడింది. అయితే ఎంతగానో ప్రేమించిన ఖలీల్ ను మాత్రం మరిచిపోలేకపోయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 9న శివరాత్రి పండుగ కోసం అత్తగారింటికి కల్పన వచ్చింది. కానీ సోమవారం నుంచి కల్పన కనిపించకుండా పోయింది.
ఈ విషయం తెలుసుకున్న కల్పన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కల్పన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశిలించారు. మంగళవారం నార్సింగ్ లో బస్సు ఎక్కి రామాయంపేటలో దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అక్కడి నుంచి ఓ యువకునితో బైక్ పై వెళ్లినట్లు గమనించిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతుండగా..నార్సింగ్ చెరువు వద్ద యువతీ యువకుల చెప్పులు కనిపించాయి. ఈ చెప్పులు ఖలీల్, కల్పనవే అని భావించిన పోలీసులు చెరువులో పడి ఆత్మహత్య చేసుకొని ఉంటారని అంచనా వేశారు. దీనితో బుధవారం గజ ఈతగాళ్లతో చెరువు మొత్తం గాలించారు. కానీ ఎక్కడా కూడా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. ఇక లాభం లేదనుకొని చెరువులో వెతకటం ఆపేశారు. అయితే నేడు (గురువారం) ఆ ఇద్దరి శవాలు చెరువులో తేలుతూ కనిపించాయి. ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే యువతి ప్రియునితో కలిసి పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రేమజంట ఆత్మహత్యపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు ఇరు కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరికీ పెళ్లి చేస్తే ప్రాణాలతో ఉండేవారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న వారికీ అప్పుడే నూరేళ్లు నిండిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Crime story, Lovers suicide, Medak, Telangana