కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా నగరంలో ఓ కన్న తండ్రి కర్కశంగా మారాడు. కన్నకొడుకును బాంబు పెట్టి చంపాలనుకున్నాడు. చివరికి ఊహించని విధంగా అదే బాంబుకు బలయ్యాడు. కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర కోల్కత్తాలోని కాశీపూర్ రోడ్లో నివాసముండే షేక్ మత్లబ్(65) మద్యానికి బానిసయ్యాడు. అతని కుమారుడు షేక్ నాజిర్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. రోజూ తాగి ఇంటికి చేరే మత్లబ్ కుమారుడితో నిత్యం గొడవ పడుతుండేవాడు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన నాజిర్తో తండ్రి మత్లబ్ తాగొచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. కోపంతో ఊగిపోయిన మత్లబ్ అప్పటికే తన చేతిలో ఉన్న నాటు బాంబును కొడుకు మీదకు విసిరే ప్రయత్నం చేశాడు.
అయితే.. నాజిర్ తన తండ్రిని తన వద్దకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించాడు. ఈ పెనుగులాటలో నాజిర్ చేతిలో బాంబు చేయి జారి కింద పడి పేలింది. పెద్ద శబ్దం రావడంతో ఇరుగుపొరుగు వారు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకుని పోలీసులకు సమాచారమందించారు. బాంబు పేలుడులో తండ్రీకొడుకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్జీ ఖర్ ఆసుపత్రికి బాధితులని తరలించగా చికిత్స పొందుతూ నాజిర్ తండ్రి షేక్ మత్లబ్ మృతి చెందాడు. కుమారుడు నాజిర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి నాజిర్ చేతి వేళ్లు తెగి పడినట్లు తెలిసింది.
మెరుగైన చికిత్స కోసం నాజిర్ను కోల్కత్తాలోని ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి తరలించారు. కాశీపూర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. మత్లబ్కు ఆ బాంబు ఎలా లభించదన్న విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. అలాంటి బాంబులు ఆ మురికివాడలో మరెక్కడైనా ఉన్నాయేమోనని జల్లెడ పట్టారు. అలాంవేవీ కనిపించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మత్లబ్కు గతంలో కొందరు నేరస్తులతో సంబంధాలున్నాయని, వారి వద్ద నుంచే అతనికి బాంబు లభించి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Kolkata