’కులాలు వేరని మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు కదా. నాతో వచ్చెయ్. మనం ఎక్కడికయినా వెళ్లిపోదాం. దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం. నిన్ను నేను బాగా చూసుకుంటా. మీ తల్లిదండ్రులు కూడా గుర్తుకురానంతగా ప్రేమగా చూసుకుంటా‘.. ఇవీ ఓ ప్రియుడి మాటలు. కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతున్న తన ప్రేయసిని కలిసి చెప్పిన విషయం. కానీ ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ‘నేను రాను. మా నాన్న కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటా. నీతో రాలేను. రెండేళ్ల మన ప్రేమకు ముగింపు పలుకుదాం. తప్పదు. సారీ. నన్ను క్షమించు‘ అంటూ ఆ యువతి తేల్చిచెప్పింది. అంతే ఆ కుర్రాడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమె ధరించిన చున్నీని ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలోని ఓ గ్రామంలో 21 ఏళ్ల పీ రంగస్వామి అనే దళిత యువకుడు, ఎం. సరస్వతి అనే 18 ఏళ్ల యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి విషయం యువతి కుటుంబానికి తెలిసింది. వారిది వేరే సామాజిక వర్గం. దీంతో సరస్వతి తండ్రి వారిద్దరి పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా యువతికి వేరే సంబంధం చూశాడు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కొద్ది రోజులుగా సరస్వతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, తనతో కలవకపోవడంతో రంగస్వామికి అనుమానం కలిగింది. నేరుగా యువతి ఇంటి వద్దకు వెళ్లి చాటుగా ఆమెను బయటకు పిలిచాడు. ఆమెను ఇంటికి కాస్త దూరంగా తీసుకెళ్లి మాట్లాడాడు.
‘పెళ్లికి మీ నాన్న ఒప్పుకోవడం లేదు కదా. అందుకే వెళ్లిపోదాం. నాతో వచ్చెయ్‘ అని అడిగాడు. దానికి ఆమె తిరస్కరించడమే కాకుండా, తాను తండ్రి చూసిన సంబంధాన్నే చేసుకుంటానని తేల్చిచెప్పింది. ప్రేమ బంధాన్ని తెంచుకుంటున్నాననీ, బ్రేకప్ చెబుతున్నానని కూడా అంది. దీంతో ఆ రంగస్వామికి ఆగ్రహం తన్నుకొచ్చింది. రెండేళ్లు ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవడం లేదేంటని నిలదీసి ఆమెతో గొడవ పడ్డాడు. ఈ గొడవలోనే ఆమె చున్నీతో మెడకు ఉరి బిగించి చంపేశాడు. అతడితోపాటు అదే సమయంలో రంగస్వామి తమ్ముడు అయిన మైనర్ బాలుడు, రవీంద్ర అనే 26 ఏళ్ల స్నేహితుడు కూడా ఉన్నాడు.
ఆమెను చంపేసి అక్కడే పడేసి అదృశ్యమయ్యారు. ఇంటికి సమీపంలోనే కూతురు శవమై కనిపించడంతో సరస్వతి తండ్రి తీవ్రంగా రోదించాడు. రంగస్వామిపైనే అనుమానం వ్యక్తం చేశాడు. సరస్వతి మరణించిన రోజు నుంచి రంగస్వామి, అతడి మిత్రుడు కనిపించడం లేదని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. ఊరికి దూరంగా బ్రిడ్జి కింద తలదాచుకున్న రంగస్వామిని, రవీంద్రను, మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు తరలించారు. మిగిలిన ఇద్దరు నిందితులకు రిమాండ్ విధించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband