112 DAYS JAIL FOR DRUNKARD MAN WHO CREATES NUISANCE IN PUBLIC PLACE AFTER CONSUMING LIQUOR IN HYDERABAD SK
Hyderabad: మందు కొట్టి లొల్లి చేసేవారికి హెచ్చరిక.. ఇతడికి పట్టిన గతే మీకూ పట్టవచ్చు..
మహ్మద్ సలీం
Hyderabad: మద్యం మత్తులో రోడ్లపై న్యూసెన్స్ చేసే వారికి హెచ్చరిక. తాగి ఊగుతూ.. రెచ్చిపోయారో.. జైల్లో ఊచల లెక్కించకతప్పదు. ఓ వ్యక్తి తాగిన మైకంలో వీరంగం సృష్టించినందుకు కోర్టు అతడికి 112 రోజుల శిక్ష విధించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మద్యం మత్తులో కొందరు (Drunkard) రెచ్చిపోతుంటారు. నడిరోడ్డుపై వీరంగం వేస్తుంటారు. అక్కడున్న వారిని ఇష్టమొచ్చినట్లు తిడుతూ.. అనవసరంగా గొడవ పెట్టుకొని.. నానా నానా రచ్చ చేస్తుంటారు. మందు నిశాలో అసలు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అంతగా తమపై తాము నియంత్రణ కోల్పోయి హద్దు మీరుతుంటారు. ఇలాగే సికింద్రాబాద్ (Secunderabad)లో ఓ వ్యక్తి మద్యం మత్తులో న్యూసెన్స్ చేశాడు. నగ్నంగా తిరుగుతూ ఇరుగుపొరుగు వారికి ఇబ్బందులు కలిగించాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పరచగా.. 112 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పకనే చెప్పారు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad)లోని కార్ఖానా బస్తీలో నివసించే మహ్మద్ సలీం తాగుడకు బానిసయ్యాడు. ప్రతిరోజూ అదే పని. తాగడం.. కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం.. ఇది నిత్యకృత్యంగా మారింది. మహ్మద్ సలీం రోజూ మందు తాగి వచ్చి.. కాలనీలో హల్ చల్ చేస్తుంటాడు. కుటుంబ సభ్యులపై దాడి చేస్తూ.. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై విరుచుకుపడుతుంటాడు. బండ బూతులు తిడుతూ చెలరేగిపోతుంటాడు. అప్పుడప్పుడూ నగ్నం రోడ్డు మీదకు వచ్చి.. స్థానికులు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తాడు. స్థానికులు ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. ఐతే అతడితో పోలీసులకు కూడా తలనొప్పే. రోడ్డు మీదే కాదు..జైల్లో కూడా రెచ్చిపోతుంటాడు మహ్మద్ సలీం. పీఎస్లో గోడకు తలను బాదుకోవడం.. చేతులు కోసుకోవడం వంటివి చేస్తుంటాడు. అతడిపై ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి.
కుటుంబ సభ్యులు ఎంత మంచిగా నచ్చజెప్పినా.. పోలీసులు తీవ్రంగా హెచ్చరించినా.. మహ్మద్ సలీం ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి రెచ్చిపోయాడు సలీం. మద్యం తాగి తల్లిదండ్రులను కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన చుట్టుపక్కల వారిని దుర్భాషలాడారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పోలీసులకు సమాచారం వెళ్లింది. వారు బస్తీకి చేరుకొని సలీంకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మనోడు వినడుగా..! పోలీసులకే చుక్కల చూపించాడు. వారితోనూ అభ్యంతరకరంగా ప్రవర్తించి.. విధులకు ఆటంకం కలిగించాడు. మీరు చెబితే నేను వినాలా.. నన్నెవ్వరూ ఏం చేయలేరు అన్నట్లుగా చెలరేగిపోయాడు.
ఎంత చెప్పినా మారకపోవడంతో.. పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. సలీంపై నగర పోలీస్ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు చేయించి.. సోమవారం 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. చార్జ్షీట్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా.. సలీం చర్యలను తీవ్రంగా పరిగణించారు మెజిస్ట్రేట్. ఈ క్రమంలోనే అతడికి 112 రోజుల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు. మద్యం మత్తులో పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్ఖానా ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.