(G. Srinivasa reddy, News18 Telugu, Khammam)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL )తో యువత పెడదారి పడుతోంది. బెట్టింగ్ (Cricket betting) మోజులో పడి సర్వం లూటీ అవుతోంది. ఖమ్మం నుంచి ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ (Hyderabad), విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్ సాగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ అనే తేడా లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, వీటిలో ఏ యాపైనా సరే ట్రాన్సాక్షన్స్ ఇట్టే నడుస్తుంటాయి. అంతేకాదు నగరంలోని కొన్ని బార్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్నారు. 14 ఏళ్ల క్రితం ఐపీఎల్ ఆవిర్భావం నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నా మొదట్లో చిన్నాచితక బెట్టింగ్లలకు పాల్పడేవారు. ముఖ్యంగా బెట్టింగ్ బుకీల మాయాజాలం దారుణంగా కొనసాగుతోంది.
కొన్నేళ్ల క్రితం వరకూ మ్యాచ్ ఫలితంపై (Match result) బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బంతి బంతికి బెట్టింగ్ సాగుతోంది. ఆన్లైన్ పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ కూడా జోరందుకుంది. యువత (Youngsters)లో క్రికెట్ జూదంపై ఆసక్తి మరింతగా పెరగడంతో బుకీలు ఇదే అదనుగా దండుకుంటున్నారు. మహిళలు సైతం బెట్టింగ్కు పాల్పడి రూ.లక్షలు కోల్పోతున్న ఉదంతాలు ఖమ్మం (Khammam)లో సైతం చోటుచేసుకుంటుండటం విచారకరం. రూ.కోట్లలో బెట్టింగ్ సాగుతున్నా రూ.లక్షల్లోనే పోలీసు దాడుల్లో పట్టుబడుతుండటం గమనార్హం. అయితే తాజాగా మహిళలు కూడా బెట్టింగ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మంలో ఈ పోకడ మరీ ఎక్కువగా ఉందని సమాచారం.
బురిడీ కొట్టిస్తున్న బుకీలు బాల్ బెట్టింగ్..
మ్యాచ్ ఎవరు గెలుస్తారు. ఏ బ్యాట్స్ మెన్ ఎన్ని పరుగులు చేస్తారు. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు పడగొడతాడు.. ఏ ఓవర్లో వికెట్ పడుతుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది.. ఇలా ఒకటేమిటి ఒక్క మ్యాచ్కు సంబంధించే అనేక రకాలుగా బెట్టింగ్ తంతు కొనసాగుతోంది. ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు రూపాయికి పది రూపాయలు ఇస్తామని చెప్పి బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత కష్టపడివచ్చి సాయంత్రమైతే చాలు బెట్టింగ్ వైపు చూస్తోంది. తెలిసీ తెలియక బెట్టింగ్ చేసి స్థానిక యువత అప్పుల పాలవుతున్నట్లు సమాచారం..
సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల్లోని మహిళలూ..
తొలుత తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో బెట్టింగ్ మొదలెట్టి ఆ తరువాత స్నేహితుల దగ్గర, ఇతర వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, ఆన్లైన్ యాప్లో అప్పులు తీసుకోవడం వాటిని బెట్టింగ్ కోల్పోతున్న ఉదంతాలు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం చేసే మహిళలతో పాటు చిరుద్యోగాలు చేసుకుని జీవించే మహిళలు సైతం బెట్టింగ్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఖమ్మంలోని కమాన్జజార్, కస్కాబజార్లోని పలు దుకాణాల్లో పనిచేస్తున్న మహిళలు, కొత్తగూడెం, ఇల్లెందు సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల్లోని మహిళలు (Women) కొందరు బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు సమాచారం.
బెట్టింగ్కు 'బార్ల' తెరిచారు..
కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బార్లలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందని సమాచారం. వారు స్క్రీన్లు ఏర్పాటు చేసి మరి దందా సాగిస్తున్నారని అంటున్నారు. వైన్ షాపుల్లో సిట్టింగ్లు, బెల్ట్ షాపుల్లోనూ టీవీలు ఏర్పాటు చేయడంతో మందుబాబులు పనిలో పనిగా బెట్టింగులు చేస్తున్నారు. ప్రతియేటా ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి హడావుడి చేసి కొంతమేర బెట్టింగ్ను నియంత్రిస్తున్న పోలీసులు ఈ ఏడాది దీనిపై అంతగా దృష్టి సారించినట్లు లేదు. ఆన్లైన్ బెట్టింగ్ ఊపందుకోవడంతో పోలీసులకు కూడా బుకీలు, టెకీల సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారింది. పోలీసులు. దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket betting, IPL 2022, Women