కరోనా లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత రాష్ట్రాలకు వచ్చేవారిని క్వారంటైన్ చేసేందుకు, అందుకు కావాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తోంది. కోవిడ్ 19 నివారణ చర్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలన్నారు. వారిక్కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కనీసం ఒక లక్ష బెడ్లు సిద్ధంచేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్ –19 క్వారంటైన్ చర్యలు చేపట్టాలని చెప్పారు. 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని జగన్ సూచించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలన్నారు. డాక్టరు, ఏఎన్ఎం, ఆశాకార్యకర్త, మందులు కూడా మొబైల్ యూనిట్కు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మొత్తం కోవిడ్–19 పరీక్షలు: 1,08,403
మే1 న జరిగిన పరీక్షలు : 5,943
ప్రతి పది లక్షలకు 2030 మందికి పరీక్షలు
పాజిటివిటీ కేసుల రేటు 1.41శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం
రాష్ట్రంలో మరణాల శాతం 2.16శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus, Covid-19