news18-telugu
Updated: April 9, 2020, 10:48 AM IST
ప్రతీకాత్మక చిత్రం
అమెరికా అర్థించింది.. బ్రెజిల్ బతిమాలింది.. ఇటలీ యాచించింది.. స్పెయిన్ వేడుకున్నది.. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు అడుగుతున్నాయి.. అన్ని దేశాల చూపు భారత్ వైపే. అందరిదీ ఒకే కోరిక. ‘మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వరూ..’ ఇదే అందరి అభ్యర్థన. మలేరియా నివారణకు వాడే ఈ మందును ప్రపంచంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది ఇండియా. వివరాల్లోకెళితే.. మలేరియా జ్వరానికి విరుగుడుగా దక్షిణ అమెరికాలో సిన్చోనా అనే చెట్టు బెరడును వాడేవారు. ఈ బెరడు నుంచే క్వినైన్ మందును తయారు చేశారు. అయితే.. మలేరియా వ్యాధి తీవ్రం కావడంతో ఈ మందును కృత్రిమంగా తయారు చేయడం ప్రారంభించారు. అదే క్లోరోక్విన్. దాన్ని శుద్ధి చేసి, తయారీ విధానంలో మార్పులు చేసి.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ను రెడీ చేశారు. ఇది మలేరియా పరాన్న జీవి వల్ల కలిగే వాపును నివారించి, ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది.
చాలా చవకగా దొరికే ఈ మందును భారత్, చైనాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంలో ఇప్కా లేబొరేటరీస్, జైడస్ కేడిలా కంపెనీలతో పాటు పలు స్థానిక కంపెనీలు తయారు చేస్తున్నాయి. దీన్ని ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది భారతే. కరోనా వ్యాధిని తగ్గించడానికి ఈ మందు ఉపయోగపడుతుందని తెలీగానే.. ప్రపంచవ్యాప్తంగా భారీ గిరాకీ ఏర్పడింది. దాంతో భారత ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని మూడు రెట్లు పెంచేశాయి. అయితే.. అమెరికా వద్ద సరైన నిల్వలు లేకపోవడంతో భారత్ను అభ్యర్థించింది. అంతేకాదు.. క్లోరోక్విన్ మిరాకిల్ డ్రగ్ అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో ఈ మందుకు మంచి గిరాకీ ఏర్పడింది.
ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్లో 85 శాతం మన దేశంలోనే తయారవుతాయి. ఇప్పుడు ఉత్పత్తిని మరింత పెంచడంతో కావాల్సినన్ని నిల్వలు మన వద్ద ఉన్నాయని కేంద్రం ప్రకటించింది కూడా. మన అవసరాలకే కాదు విదేశాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం మన ఫార్మా కంపెనీలకు ఉందని స్పష్టం చేసింది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
April 9, 2020, 10:48 AM IST