విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తిపై నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఆయన... నగరంలో కొన్ని పాజిటివ్ కేసులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశం కాదని ఆయన వివరించారు. మాకేం కాదనే భావనతో ప్రజలెవరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎవరైనా అనవసరంగా రోడ్డు మీదకు వస్తే ఇక క్రిమినల్ కేసులు పెడతామని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కోర్టు కేసుల్లో ఇరుక్కోవద్దని ఆయన సూచించారు. ఈ నెల 20 తరువాత కూడా నగరంలో లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఇక విజయవాడలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేడు కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు నమోదు కాగా... అందులో 16 కేసులు విజయవాడ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని కార్మికనగర్లో 8 కేసులు నమోదు కాగా, ఖుద్దుస్ నగర్, విద్యాధరపురం, గుప్తా సెంటర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరపేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. బాధితులకు ఎవరి నుంచి వైరస్ సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైరస్ సోకిన వారు నగరంలో ఏయే ప్రాంతాల్లో తిరిగారు, ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
Tags: Andhra Pradesh, Coronavirus, Police, Vijayawada